‘సరిపోదా’ సినిమా చూసి.. అద్దం బద్దలు కొట్టి

టాలీవుడ్లో దాదాపు 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు సీనియర్ నటుడు శివాజీ. కెరీర్ ఆరంభంలో సహాయ పాత్రలు చేసిన అతను.. తర్వాత హీరోగా మారాడు. అడపాదడపా కొన్ని హిట్లు కొట్టాడు. కానీ హీరోగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. హీరోగా ఛాన్సులు ఆగిపోవడంతో ఒక దశ దాటాక శివాజీ సినిమాలే మానేశాడు. రాజకీయాల మీద దృష్టిపెట్టాడు. కానీ కొంత కాలానికి రాజకీయాలకు సైతం దూరం అయిపోయాడు. లైమ్ లైట్లో లేకుండా పోయాడు. కానీ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడంతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ ఎంత మంచి స్పందన తెచ్చుకుందో తెలిసిందే. అయినా సరే.. సినిమాల్లో బ్రేక్ వస్తేనే కదా కిక్కు. ఆ బ్రేక్ ‘కోర్ట్’ రూపంలో వచ్చింది.

ఇందులో మంగపతి క్యారెక్టర్లో శివాజీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో మేజర్ హైలైట్ అదే అని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. ‘కోర్ట్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, తన పాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడం గురించి మొన్నటి సక్సెస్ మీట్లో శివాజీ ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాను అనుభవిస్తున్న వేదన గురించి మాట్లాడాడు శివాజీ.

‘‘పాతికేళ్లుగా సినీ రంగంలో ఉన్నా. శుక్రవారం ఇది నా రోజు అనుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నా. కానీ కుదరడం లేదు. నాకు తగిన పాత్ర రావడం లేదని చాలా ఫీలయ్యేవాడిని. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంలో సూర్య పాత్ర చూసి చాలా బాధేసింది. నాకెందుకు ఇలాంటి పాత్ర రావడం లేదు అని.. బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకుంటూ కోపంతో చేత్తో అద్దాన్ని గట్టిగా కొట్టా. చెయ్యి వాచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా. ఈ విషయాన్ని నానితో కూడా చెప్పాను. కానీ మంగపతి పాత్ర నా ఆకలిని తీర్చింది. ‘నైంటీస్’ సిరీస్ వచ్చిన ఏడాదికి ‘కోర్ట్’ మూవీ వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. అందరూ నేను చేసిన మంగపతి పాత్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది’’ అని శివాజీ తెలిపాడు.