అతడు మీద కర్చీఫులు వేస్తున్నారు

కొత్తవే కాదు మహేష్ బాబు పాత సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు బంగారు బాతులైపోతున్నాయి. మురారి, బిజినెస్ మెన్ తర్వాత అయిదు కోట్ల గ్రాస్ దాటిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పరీక్షలు, ఎండలున్న అన్ సీజన్ లోనూ వసూళ్లు రాబట్టడం ట్రేడ్ ని నివ్వెరపరిచింది. ఛావా లాంటి పోటీని తట్టుకుని పదిహేనేళ్ల పాత చిత్రం జనాన్ని థియేటర్లకు రప్పించడం చిన్న విషయం కాదు. అందులోనూ నిన్న ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఉన్నా సరే ఆడియన్స్ సీతమ్మ కోసం వెళ్లడం విచిత్రమే. అసలు విషయానికి వస్తే ఆగస్ట్ 9 ప్లాన్ చేసుకున్న అతడు కోసం ఇప్పటి నుంచే పోటీ ఏర్పడిందట.

మహేష్ ఫిల్మోగ్రఫీలో అతడుది ప్రత్యేక స్థానం. థియేటర్ రిలీజ్ జరిగిన 2005లో ఇది ఎంత హిట్టయినా తాను భారీ స్థాయిలో లాభాలు కళ్లచూడలేదని నిర్మాత మురళీమోహన్ పలు సందర్భాల్లో చెప్పారు. తర్వాత శాటిలైట్ ప్రీమియర్ జరిగాక అత్యధిక సార్లు టెలికాస్ట్ చేసుకుని విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ గా లెక్కలేనంత ఆదాయం, పేరు తీసుకొచ్చింది. అప్పట్లో డివిడి అమ్మకాల్లోనూ అతడుదే రికార్డు. మణిశర్మ పాటలు, నాజర్ ఇంట్లో సెంటిమెంట్, సోను సూద్ పాత్ర, కోట విలనీ, త్రిష గ్లామర్, బ్రహ్మానందం కామెడీ ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి పదే పదే మళ్ళీ చూసేలా ప్రేరేపించాయి.

సో అతడుకి దక్కబోయే వెల్కమ్ మాములుగా ఉండబోదు. 4K పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. సౌండ్ మిక్సింగ్ ప్రత్యేకంగా చేయిస్తున్నారని తెలిసింది. ఎస్ఎస్ఎంబి 29 రావడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అతడుని కొత్త రిలీజ్ అన్న రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికన్నా ముందు అతిథి, టక్కరి దొంగ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ అతడు రీ రిలీజ్ అయ్యేది పుట్టినరోజు కాబట్టి స్పెషల్ మెమరీగా చేసుకుంటారు. అందుకే ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్లు మురళీమోహన్ ని తరచు సంప్రదిస్తూ భారీ రేట్లు ఆఫర్ చేస్తూ హక్కులు ఇమ్మని అడుగుతున్నారట. రికార్డు డీల్ సెట్ అవ్వొచ్చు.