అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన కుబేర విడుదల తేదీ వచ్చేసింది. జూన్ 20 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ పాత్ర పరంగా నాగార్జునకు సైతం చాలా ప్రాధాన్యం ఉండటంతో దీన్నీ మల్టీ స్టారర్ గానే పరిగణించాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మనీ క్రైమ్ డ్రామాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. కాంబినేషన్ల పరంగా ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక తెలివైన ఎత్తుగడ ఏంటో చూద్దాం.
వేసవి సీజన్ ముగింపులో జూన్ చాలా కీలకం. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమా ఆ నెలను లాక్ చేసుకోలేదు. చిరంజీవి విశ్వంభరని అనుకున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టేదాకా డేట్ ఆశించలేం. రవితేజ మాస్ జాతర సైతం ఇలాంటి మీమాంసనే ఎదురుకుంటోంది. జూన్ 5 కమల్ హాసన్ తగ్ లైఫ్ ఒక్కటే ఇప్పటిదాకా అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ. ఆ తర్వాతి వారం ఖాళీగానే ఉంది. జూన్ చివరి వారం సైతం ఎవరూ ఎంచుకోలేదు. సో కుబేర కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ పుష్కలంగా దక్కుతుంది.
ఇంకో ఇంకో కారణం కూడా ఉంది. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లి కడాయ్ ఏప్రిల్ 10 రావాలి. ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యే పక్షంలో మే అనుకుంటున్నారు. అదే జరిగితే తన రెండు సినిమాల మధ్య కనీసం నెల రోజుల పైన గ్యాప్ లేకపోతే థియేటర్స్ పరంగా ఇబ్బంది వస్తుందని భావించి కుబేర నిర్మాతలకు ఆ మేరకు సూచనలు చేశాడట. ఎలాగూ పోస్ట్ ప్రొడక్షన్ కి టైం పడుతోంది కాబట్టి శేఖర్ కమ్ముల సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తండేల్ సూపర్ హిట్ తో నాగచైతన్యకు వంద కోట్ల గ్రాస్ వచ్చిందని ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు నెక్స్ట్ కుబేర ఎలాంటి ఫలితం ఇస్తుందో మూడున్నర నెలల్లో తేలనుంది.