రాజమౌళి ఫ్రెండు రీఎంట్రీ

సాయి కొర్రపాటి.. ఒకప్పుడు టాలీవుడ్లో మార్మోగిన పేరు. ‘ఈగ’ లాంటి సెన్సేషనల్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేశాడాయన. సాయి రాజమౌళికి ఆప్త మిత్రుడు అన్న సంగతి తెలిసిందే. ‘ఈగ’ తర్వాత రాజమౌళితో కలిసి ‘అందాల రాక్షసి’ సినిమాను నిర్మించాడు సాయి. అలాగే రాజమౌళి శిష్యుడైన త్రికోఠిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేశాడు.

సాయి నిర్మించే సినిమాలకు తరచుగా జక్కన్న అతిథిగా వచ్చేవాడు. ఆ సినిమాలను ప్రమోట్ చేసేవాడు. వీళ్లిద్దరి బంధం గురించి టాలీవుడ్లో అందరికీ తెలుసు. ఐతే ఒక దశలో వరుసగా వినూత్నమైన సినిమాలు నిర్మిస్తూ మంచి పేరు సంపాదించిన సాయి.. తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో ప్రొడక్షన్ ఆపేశాడు. చివరగా ఆయన్నుంచి వచ్చిన సినిమా ‘యుద్ధం శరణం’. అది సాయిని దారుణంగా దెబ్బ కొట్టింది. దీంతో సినిమాల నిర్మాణమే ఆపేశాడు.

మధ్యలో ‘కేజీఎఫ్’ సినిమాను అనువాదం చేసి రిలీజ్ చేయడం మినహాయిస్తే సొంతంగా అయితే సాయి సినిమాలు నిర్మించలేదు. ఐతే కొంత విరామం తర్వాత ఆయన ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఐతే ఈసారి కూడా ఆయన రాజమౌళి ఫ్యామిలీతోనే అసోసియేట్ అవుతున్నారు. కీరవాణి చిన్న కొడుకు సింహాను కథానాయకుడిగా పెట్టి సినిమా తీయబోతున్నాడట. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడట.

సింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైంది ఒకే సినిమాతో. అదే.. మత్తు వదలరా. ఈ సినిమా తర్వాత కాలభైరవ సంగీత దర్శకుడిగా వరుసగా సినిమాలు చేసుకుపోతుండగా.. సింహా మాత్రం తర్వాత ఏ చిత్రం చేయలేదు. వీళ్లిద్దరితో కలిసి సాయి రంగంలోకి దిగుతున్నాడు. మరీ రీఎంట్రీలో అయినా ఆయనకు మంచి ఫలితాలొస్తాయేమో చూడాలి.