సఖి, చెలి లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మాధవన్ ఎప్పటి నుంచో సుపరిచితుడే. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్టు అనిపించినా కొన్నేళ్లుగా తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడు. నాగ చైతన్య సవ్యసాచి ఆడలేదు కానీ లేదంటే అందులో పెర్ఫార్మన్స్ కి మరిన్ని టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టేవి. అజయ్ దేవగన్ సైతాన్ లో చేతబడి చేసే మాంత్రికుడిగా భయపెట్టిన మాధవన్ అంతకు ముందు రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ద్వారా హీరోగా, దర్శకుడిగా ఒక నిజ జీవిత సైంటిస్ట్ కథను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించాడు. తాజాగా మరో క్రేజీ సబ్జెక్టుని పట్టి ఇంకో బయోపిక్ తో వస్తున్నాడు.
కోయంబత్తూర్ వాస్తవ్యులు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. ఈయన్ని ఎడిసన్ అఫ్ ఇండియా అని పిలిచేవారు. మన దేశంలో మొదటి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది నాయుడే. తొలుత పారిశ్రామిక పరికరాలను కనుగొనడంలో తన ప్రతిభను చూపించడం మొదలుపెట్టి క్రమంగా ఆటోమొబైల్ లాంటి ఇతర రంగాలకు విస్తరింపజేశారు. పుట్టి పెరిగిన నగరానికి సంపద సృష్టించిన మేధావిగా జిడిఎన్ కు ఎన్నో పేరు ప్రఖ్యాతులున్నాయి. విచిత్రం ఏంటంటే ఒక రైతు కుటుంబలో పుట్టి చదువంటే ఆసక్తి లేక స్కూల్ కు దూరంగా ఉంటూ హోటల్ లో సర్వర్ గా జీవితాన్ని ప్రారంభించారు. స్కూటర్ కొనడం కోసం డబ్బు దాచుకునేవారు.
మెకానిక్ గా మారాక స్వంతంగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. పదకొండు గంటల్లో ఇల్లు కట్టిన అరుదైన ఘనతలు ఈయన ఖాతాలో ఉన్నాయి. 1974లో జిడిఎన్ కన్నుమూశారు. ఇక్కడ మొత్తం చెప్పడం సాధ్యపడదు కానీ గోపాలస్వామి జీవితంలో బోలెడంత డ్రామా, ఎమోషన్, స్ఫూర్తి ఉన్నాయి. త్వరలో ఇవి మాధవన్ ద్వారా పరిచయం కాబోతున్నాయి. జిడిఎన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ బయోపిక్ కి కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, యోగిబాబు ఇతర తారాగణం. మిరకిల్ మెన్ అని జనం పిలుచుకునే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు వెండితెరపై ఎన్ని అద్భుతాలు చేస్తారో.