సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 40 రోజుల తర్వాత ఓటిటిలో రిలీజవుతోంది. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి నాలుగు వారాల అగ్రిమెంటే జరిగిందని, ఆ కారణంగా ఫిబ్రవరి రెండో వారంలోనే వస్తుందనే ప్రచారం జరిగింది కానీ ఊహించని విధంగా కొంత ఆలస్యం జరిగింది.
నిజానికి సితార ఎంటర్ టైన్మెంట్స్ గత సినిమాలు గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్ మొదలైనవి 28 రోజుల విండోతో బుల్లితెరపైకి వచ్చాయి. దాంతో డాకు మహారాజ్ కూడా అదే బాట పడుతుందనే ప్రచారం జరిగింది. కానీ జరిగింది వేరు.
ఇన్ సైడ్ ప్రకారం డాకు మహారాజ్ హిందీ వెర్షన్ లేట్ గా థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఆశించిన ఫలితం దక్కలేదు కానీ నార్త్ మల్టీప్లెక్సుల్లోనూ రిలీజ్ అయ్యేలా నిర్మాత ప్లాన్ చేసుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం యాభై రోజుల తర్వాతే డిజిటల్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2 ది రూల్ లాంటివి అదే సూత్రం పాటించాయి.
కానీ డాకు మహారాజ్ విషయంలో కొంత తటపటాయింపు జరిగిందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ఇచ్చిన యాడ్ లో బాషల ప్రస్తావన లేదు. అంటే ఇప్పటికైతే హిందీ ఉండదన్న మాట. మిగిలిన లాంగ్వేజులు పెట్టొచ్చు. మొత్తానికి డాకు ర్యాంపేజ్ వచ్చే వారం నుంచి చూడాలి.
పండగ రిలీజుల్లో గేమ్ ఛేంజర్ ఆల్రెడీ ఓటిటిలో వచ్చేసింది. డాకు మహారాజ్ డేట్ లాకయ్యింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ముందు టీవీ ఛానల్ లో ప్రీమియర్ అయ్యాక స్మార్ట్ స్క్రీన్ పైకి వచ్చే కొత్త ట్రెండ్ మొదలుపెట్టనుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిన డాకు మహారాజ్ వసూళ్లు బాగానే తెచ్చింది కానీ వెంకటేష్ సినిమా వల్ల ప్రభావితం చెంది డబుల్ సెంచరీ మార్కును అందుకోలేకపోయింది.
మిక్స్డ్ టాక్ లేకపోయినా, మాస్ ని సంతృప్తి పరిచినా ఫ్యామిలీ జనాలకు కావాల్సిన అంశాలు తగ్గడంతో కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడింది. వ్యూస్ పరంగా డాకు రికార్డులు నమోదు చేయడం ఖాయం.