గుణ‌శేఖ‌ర్ చెప్ప‌బోయే క‌థ ఇదేనా?

రుద్ర‌మ‌దేవి త‌ర్వాత ఐదేళ్ల విరామం తీసుకున్నాడు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. రానా ద‌గ్గుబాటితో హిర‌ణ్య‌క‌శ్య‌ప లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకున్నాడు కానీ.. అది అనుకున్న ప్ర‌కారం ప‌ట్టాలెక్క‌లేదు.

అది ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఈలోపు వేరే సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్.. ఆ సినిమా టైటిల్, ఇత‌ర విశేషాల‌ను వెల్ల‌డించాడు. శ‌కుంత‌లం పేరుతో ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇది కూడా ఒక పురాణ గాథే కావ‌డం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా.. గుణ‌శేఖర్ సొంత సంస్థ గుణ టీమ్ వ‌ర్క్స్ బేన‌ర్ మీద ఆయ‌న స‌తీమ‌ణి నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఇంత‌కీ ఈ శ‌కుంత‌లం క‌థేంటి అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. మ‌హాభార‌తంలో ఉప‌క‌థ అయిన శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజుల ప్రేమ‌గాథ‌నే గుణ‌శేఖ‌ర్ వెండి తెర మీదికి తేబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అపురూప‌మైన సౌంద‌ర్య‌వ‌తి అయిన శ‌కుంత‌ల క‌ణ్వ‌మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో పెరిగి పెద్ద‌వుతుంది. ఒక రోజు జింకను వేటాడుతూ ఆ ఆశ్ర‌మానికి వ‌చ్చిన దుష్యంత మ‌హారాజు ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని గర్భ దానం కూడా చేస్తాడు. తన రాజ్యానికి వెళ్ళి సకల రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి వెళ్లిన దుష్యంతుడు ఎంతకూ రాడు. ఈలోపు భ‌ర్త‌ను త‌లుచుకుంటూ క‌ణ్వ ఆశ్ర‌మానికి వ‌చ్చిన దూర్వాస మ‌హ‌ర్షిని ప‌ట్టించుకోనందుకు శ‌కుంత‌ల‌ను ఆయ‌న శ‌పిస్తాడు. ఈ శాపం వ‌ల్ల దుష్యంతుడు శకుంత‌ల‌ను మ‌రిచిపోతాడు. త‌ర్వాత శ‌కుంత‌ల భ‌ర‌తుడికి జ‌న్మ‌నిస్తుంది. త‌ర్వాత అనేక ప‌రిణామాల త‌ర్వాత‌ దుష్యంతుడు భార్య ద‌గ్గ‌రికి వ‌స్తాడు. భ‌ర‌తుడిని కొడుగ్గా అంగీక‌రిస్తాడు. ఎక్కువ‌గా ప్ర‌చారంలో ఉన్న క‌థ ఇది కాగా.. ఇందులో ర‌క‌ర‌కాల వెర్ష‌న్లు ఉన్నాయి. ఈ క‌థ‌లో మ‌లుపుల‌కైతే లోటు లేదు. దాన్ని ఇప్పుడు గుణ తెర‌పైకి తేబోతుండ‌టం ఆస‌క్తి రేకెత్తించేదే.