మెగాస్టార్ ఏం చేస్తున్నాడబ్బా..

కరోనా టైంలో సినీ పరిశ్రమ గురించి ఎంతగానో ఆందోళన చెందిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కార్మికులను ఆదుకోవడం కోసం అందరికంటే ముందు కోటి రూపాయల విరాళం ప్రకటించి కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేయించింది ఆయనే. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్‌లను సాధ్యమైనంత త్వరగా పున:ప్రారంభింపజేయాలని కూడా ఆయన చూశారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అధినేతల్ని కలిశారు.

తన ‘ఆచార్య’ సినిమా కోసం ట్రయల్ షూట్ చేసి రంగంలోకి దిగాలని నాలుగు నెలల ముందే ఆయన ప్రయత్నించారు. కానీ అప్పుడు అది సాధ్యపడలేదు. మొత్తంగా సినీ పరిశ్రమలో ఎవ్వరూ కూడా షూటింగ్ మొదలుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే కరోనా ప్రభావం కొంచెం తగ్గడం, దాని తాలూకు భయం కూడా పోవడం, ఇంకెంతో కాలం షూటింగ్‌లను ఆపే పరిస్థితి లేకపోవడంతో గత నెలలో టాలీవుడ్లో వరుసగా సినిమాలన్నీ మళ్లీ సెట్స్ మీదికి వెళ్లిపోయాయి.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం కూడా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టుకుంది. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ సహా దాదాపుగా అన్ని పెద్ద సినిమాలను షూటింగ్‌కు వెళ్లిపోయాయి. కానీ ‘ఆచార్య’ గురించి మాత్రం ఏ ఊసూ లేదు. ఇప్పటికే షూటింగ్ మొదలైందని కానీ.. త్వరలో మొదలవుతుందని కానీ సంకేతాలు లేవు. ఎప్పుడెప్పుడూ మళ్లీ షూటింగ్ మొదలుపెడదామా అన్నట్లున్న చిరు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది అర్థం కావడం లేదు. వచ్చే వేసవికి అయినా ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాల్సిందే.

మరి చిరు టీంను ఆపుతున్నదేంటో తెలియడం లేదు. మిగతా వాళ్లలా కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయక తప్పని పరిస్థితుల్లో ఇంకా దేని గురించి ‘ఆచార్య’ టీం ఎదురు చూస్తోందో అర్థం కావడం లేదు. అందరికంటే ముందు చిరు రంగంలోకి దిగి మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారనుకుంటే.. అందరూ పనిలోకి దిగాక కూడా చిరు సైలెంటుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.