‘లక్ష్మీబాంబ్’ డీల్ తెగిందా?

థియేటర్లు ఇంకో ఆరు నెలల పాటు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాల్ని నెమ్మదిగా ఓటీటీల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది వివిధ ఫిలిం ఇండస్ట్రీల్లో. తెలుగులో ‘అమృతారామమ్’ అనే సినిమా ఈ నెల 29న జీ5లో రిలీజ్ కానుంది.

తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే ఇవి చిన్న సినిమాలు కాబట్టి పర్వాలేదు కానీ.. పెద్ద బడ్జెట్లలో తెరకెక్కిన సినిమాల్ని ఓటీటీలకు ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది.

పెట్టుబడి మీద లాభానికి ఓటీటీలు ఈ సినిమాల్ని కొంటాయా అన్నది సందేహం. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది.

ఐతే టాక్ ఎలా ఉన్నా వంద కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తుంటాయి అక్షయ్ సినిమాలు. ఇక హిట్ టాక్ వస్తే రూ.150-200 కోట్ల మధ్య వసూళ్లు వస్తాయి. అలాంటిది ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారనే సందేహాలు కలిగాయి. కానీ ఈ సినిమాను హాట్ స్టార్ వాళ్లు మంచి రేటు పెట్టి కొనేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ ఒక‌రు ట్విట్ట‌ర్లో ప్ర‌క‌టించేశారు.
రూ.90 కోట్లకు డీల్ తెగినట్లు ఆయన‌చెబుతున్నారు. ఈ సినిమాకు అక్షయ్ కుమార్ పారితోషకం కాకుండా రూ.40 కోట్ల ఖర్చయిందట. అక్షయ్‌కి లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉందట. ఐతే ముందు బడ్జెట్ మీద కొంత మేర లాభానికి సినిమాను అడగ్గా నిర్మాతలు ఒప్పుకోలేదట. చివరికి రూ.50 కోట్ల లాభం వచ్చేలా డీల్ ఓకే అయిందంటున్నారు.

ఇందులోంచి అక్షయ్‌కి మెజారిటీ వాటా వెళ్తుందని సమాచారం. ‘కాంఛన’కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల్ని ముందే హాట్ స్టార్ సొంతం చేసుకున్న మాట వాస్త‌వం. కానీ థియేట్రిక‌ల్ రిలీజ్ లేకుండా నేరుగా హాట్ స్టార్‌లో రిలీజ్ చేసేందుకు తాజాగా ఒప్పందం మార్చారంటున్నారు. ఇదెంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.