సాయిపల్లవి ‘పీఆర్’ వ్యాఖ్యలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ గిమ్మిక్స్ గురించి అప్పుడప్పుడూ వార్తలు బయటికి వస్తుంటాయి. వాళ్లు ఎయిర్ పోర్ట్‌లో అడుగు పెడితే చాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతుంటాయి. తమకు తెలియకుండా ఇవి జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. కానీ ఇదంతా పీఆర్ టీమ్స్ మహిమ అని సౌత్ హీరోయిన్ ప్రియమణి గతంలో వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను నియమించుకుని సదరు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేలా చూసుకుంటారని.. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చారని, కానీ అంగీకరించలేదని ప్రియమణి వెల్లడించింది.

ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇలాంటి కామెంట్సే చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండేందుకు పీఆర్ టీమ్స్ ద్వారా ఎలా ప్రయత్నిస్తారో ఆమె వెల్లడించింది.

తన కొత్త చిత్రం ‘అమరన్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. “బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేశారు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి, వార్తల్లో నిలవడానికి పీఆర్ టీంను నియమించుకుంటారా అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్ లైట్లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనిపించింది. ఎందుకంటే తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకుల విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిదేమీ అవసరం లేదని చెప్పేశా” అని చెప్పింది.

సాయిపల్లవి ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా, ఎవరి మీదా విమర్శలు చేయకపోయినా.. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా పీఆర్ టీంలను మెయింటైన్ చేయడం ద్వారా నిత్యం తాము వార్తల్లో ఉండేలా, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటారని చెప్పకనే చెప్పినట్లు అయింది. దీంతో సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.