గేమ్ చేంజర్ OTT రచ్చ వెనుక జరిగిందేంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో చిన్న పాటి దుమారం రేపింది. ఈ సినిమా ఓటిటి హక్కులు కేవలం 50 కోట్లకు అమ్ముడుపోయాయని, అంత తక్కువ మొత్తం చరణ్ స్టార్ డం తగ్గడాన్ని సూచిస్తోందని కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేయడంతో పుకార్లకు రెక్కలొచ్చాయి. దీని వెనుక వేరే కోణాలున్నాయి. ఒక బాలీవుడ్ ఎక్స్ హ్యాండిల్ లో గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ ని యాభై కోట్లకు అగ్రిమెంట్ చేయబోతున్నట్టు ప్రచురించింది. అందులో హిందీ వెర్షనని ప్రస్తావించకపోవడంతో అన్ని భాషలకు కలిపి అనే అర్థం వచ్చింది.

నిజానికి అమెజాన్ ప్రైమ్ నెలల క్రితమే ఈ ప్యాన్ ఇండియా మూవీని కొనేసుకుంది. ఆ మేరకు అతి త్వరలో అంటూ ఇచ్చిన యాడ్స్ లో దీని ప్రకటన కూడా ఉంది. ఒప్పందం జరగకుండా పొరపాటున కూడా ప్రైమ్ అలా చేయదు. కానీ అగ్రిమెంట్ జరిగింది తమిళ తెలుగు బాషలకు మాత్రమేనట. అది కూడా వంద నుంచి నూటా పది కోట్ల మధ్యలో ఉండొచ్చని టాక్. రీమేకైన గాడ్ ఫాదరే యాభై కోట్లకు అమ్ముడుపోయినప్పుడు గేమ్ ఛేంజర్ అంతే మొత్తానికి ఇవ్వడం లాజిక్ కి సత్యదూరం. సో గాసిప్ హడావిడి తాలూకు అసలు ట్విస్టు ఏంటంటే కేవలం అది హిందీ వెర్షన్ గురించే.

ఇండియన్ 2 ప్రభావం ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మీద పడటం లేదు. అది ఎంత డిజాస్టర్ అయినా శంకర్ గత ట్రాక్ రికార్డు మీద నమ్మకంతో బయ్యర్లు, ప్రేక్షకులు చరణ్ సినిమా మీద గంపెడాశలతో ఉన్నారు. ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. టీజర్ సిద్ధంగా ఉంది కానీ దీపావళికి వదలాలా వద్దా అనే దాని మీద ఈ వారంలో నిర్ణయం తీసుకుంటారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ లో తమన్ ఇచ్చిన మరో మూడు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. జనవరి 10 ఇంకో రెండున్నర నెలల్లో వచ్చేస్తోంది కనక పబ్లిసిటీ స్పీడ్ వీలైనంత త్వరగా పెంచేయాలి.