జగన్ సర్కారును అయోమయంలో పడేసిన మద్యనిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో మద్య నిషేధం అత్యంత ప్రధానమైంది. దేశవ్యాప్తంగా మద్యం ఏరులై పారుతున్న ఈ రోజుల్లో మద్య నిషేధం అమలు చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద అతిగా ఆధారపడుతున్నాయి.

సంక్షేమ పథకాలకు ఈ ఆదాయమే ఆయువుపట్టుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఐతే అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే మద్యం షాపులు తగ్గించడం, అమ్మకాల వేళల్ని కుదించడం ద్వారా ఈ హామీ విషయంలో సిన్సియర్‌గా ఉన్నట్లు సంకేతాలిచ్చారు జగన్. దీంతో తర్వాత ఏం జరగబోతోందన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది.

ఐతే లాక్ డౌన్ తర్వాత పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏపీలోని మద్యం దుకాణాల్లో పేరున్న బ్రాండ్లన్నీ కనిపించడం మానేశాయి. ఎప్పుడూ కనీ విని ఎరుగని లోకల్ బ్రాండ్లు ప్రత్యక్షమయ్యాయి. పైగా రేట్లు విపరీతంగా పెంచేశారు. మద్యపానం విషయంలో జనాల్ని నిరుత్సాహ పరిచేందుకే ఈ నిర్ణయం అన్నారు. దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగానే ఇలా చేశామన్నారు. కానీ ఈ మాటల్ని జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో లాజిక్ కనిపించడం లేదు. ఎందుకంటే మద్యం ఆదాయం మీద ప్రభుత్వం విపరీతంగా ఆధారపడుతుండటం, ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాల్ని కొనసాగించగలుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది.

పాత బకాయిలు తీర్చలేదని, ఆదాయ పంపిణీ దగ్గర తేడాలు రావడంతో పేరున్న బ్రాండ్లన్నింటినీ ఏపీ సర్కారు పక్కన పెట్టేసింది. వైకాపా నాయకులు, వారి బినామీలే మద్యం ఫ్యాక్టరీలు పెట్టి తక్కువ పెట్టుబడితో చీప్ క్వాలిటీతో మద్యం తయారు చేసి భారీ లాభాలకు అమ్ముకుంటూ విపరీతంగా ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం వీటినే ప్రోత్సహిస్తోంది. బ్రాండెడ్ మద్యం ఇప్పుడిప్పుడే ఏపీ దుకాణాల్లో కనిపించే అవకాశాలు కనిపించడం లేదు.

మరోవైపు కోరుకున్న మద్యం బ్రాండ్ దొరకట్లేదని, క్వాలిటీ లేని లోకల్ బ్రాండ్లకు విపరీతమైన రేటు పెట్టాల్సి వస్తోందని.. లేదంటే బ్లాక్‌లో ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధర పెట్టి బ్రాండెడ్ మద్యం కొనాల్సి వస్తోందని మందుబాబులైతే జగన్ సర్కారు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఐతే ఇక్కడ పెంచింది మద్యం ధరలు కాబట్టి వాళ్ల గోడును వెళ్లబోసుకున్నా వినే నాథుడుండడు.

అసలే మద్యపానం హానికరం అంటే.. ఏపీలో తయారవుతున్న లో క్వాలిటీ లోకల్ బ్రాండ్లు తాగితే మరీ ప్రమాదం అంటున్నారు నిపుణులు. కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఓవైపు ప్రభుత్వం మద్యపానం విషయంలో చిత్తశుద్ధితో ఉందని వేరే జనాలూ నమ్మట్లేదు.. మరోవైపు మందుబాబుల్లోనూ తీవ్ర ఆగ్రహం నెలకొంది. మొత్తంగా చూస్తే ఏపీలో రాబోయే రోజుల్లో ‘మద్యం’ జగన్ సర్కారు కొంపముంచే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది.