శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘‘ శ్రీవారి ధనప్రసాదం ’’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణేలను తిరిగి భక్తులకు శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తోంది.

చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవడంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వంద రూపాయల చిల్లర నాణేలు ప్యాకెట్లను ఎంక్వైరీ కార్యాలయం‌ వద్ద టీటీడీ అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటారు. కేవలం నోట్లే కాకుండా చిల్లర నాణేలు సైతం హుండీలో వేస్తుంటారు. నూట పదహార్లు.. వెయ్యి నూట పదహార్ల రూపంలో నోట్లతోపాటు చిల్లర కూడా సమర్పించుకునేవారు ఎక్కువ.

ఈ చిల్లర ఎక్కువగా ఉంటుండటంతో.. లెక్కింపు అనంతరం టీటీడీ దాన్ని బ్యాంకులో జమ చేస్తోంది. కానీ చిల్లర తీసుకోవడానికి బ్యాంకులు వెనుకాడుతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయంలోని హుండీల్లో ఉంచిన ధనం కావడం.. భక్తులు పవిత్రభావంతో ‘ధన ప్రసాదాన్ని’ స్వీకరిస్తారని.. తద్వారా చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుందని టీటీడీ ఆశిస్తోంది.