డిప్యుటీ మేయర్ గా అరంగేట్రం

తొందరలో జరగబోతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యుటి మేయర్ గా అభినయ్ రెడ్డి ఎన్నికవ్వటం ఖాయమేనా ? తిరుపతిలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే అభినయ్ రెడ్డి ఎన్నిక లాంఛనమనే చెప్పాలి. ఎందుకంటే అభినయ్ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కాబట్టి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారుసునిగా కొడుకును పోటీ చేయించే ప్లాన్ లో ఎంఎల్ఏ ఉన్నారు.

షెడ్యూల్ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా దీన్నే రాజకీయ అరంగేట్రంగా ఉపయోగించుకోవాలని భూమన డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కార్పొరేషన్ 4వ డివిజన్ నుండి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. అధికారికంగా ప్రకటించటమే మిగిలుంది. నిజానికి కొడుకును మేయర్ పీఠం మీదే కూర్చోబెట్టాలని ఎంఎల్ఏ ముందు అనుకున్నారు. అయితే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు.

తిరుపతిలో బీసీలు, బలిజలు, బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువున్నాయి. వీళ్ళ తర్వాత ముస్లిం మైనారిటిలు, రెడ్లు, ఎస్సీ, క్రిస్తియన్ల జనాభా ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గాన్ని కూడా పక్కన పెట్టేసి బీసీలు, కాపులు, ముస్లిం మైనారిటిలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎంఎల్ఏ తన ఆలోచనను మార్చుకుని తిరుపతి కార్పొరేషన్ కు బీసీ మహిళను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని డిసైడ్ అయ్యారు.

నిజానికి తిరుపతి మేయర్ పోస్టు జనరల్ కోటాలోనే ఉంది. అయినా బీసీ మహిళను ఎంపిక చేయటంలో రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిది జగన్ అడుగుజాడల్లో నడుస్తు బీసీకి+మహిళకు ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది. రెండోది తన కొడుకు ఏకగ్రీవంగా గెలిచినా మేయర్ పీఠం విషయంలో పార్టీ లైనుకు కట్టుబడున్నట్లు చెప్పుకోవచ్చు. మూడోది భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పై సామాజికవర్గాల మద్దతును కూడగట్టవచ్చని ఎంఎల్ఏ ఆలోచించినట్లు ప్రచారంలో ఉంది.

సరే డిప్యుటి మేయర్ విషయాన్ని పక్కన పెట్టేస్తే మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఆసక్తిగా మారింది. 27వ డివిజన్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ జల్లి శిరీష, అనిత మధ్యే పోటీ ఉందంటున్నారు. అయితే ఎంఎల్ఏతో పాటు చాలామంది శిరీష వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ డాక్టర్ చాలా కాలంగా పార్టీలోనే పనిచేస్తున్నారు. అనిత మాత్రం మొన్నటి ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. దీంతో కార్పొరేషన్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలో మేయర్ పీఠాన్ని డాక్టర్ శిరీష కూర్చునే అవకాశాలున్నాయి. చివరి నిముషంలో రాజకీయం ఏమన్నా మారుతుందేమో చూడాలి.