మాట నిలబెట్టుకున్న సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంత మంచివాడో ఒక్కొక్కరుగా బాలీవుడ్ సెలబ్రెటీలు చెప్పుకొస్తుంటే.. అతడి అభిమానుల బాధ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. తాజాగా సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచరా’ దర్శకుడు ముకేష్ చబ్రా తన హీరో గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. ముకేష్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

అతణ్ని దర్శకుణ్ని చేస్తానని సుశాంత్ ఎన్నో ఏళ్ల కిందట మాట ఇచ్చి.. ఇప్పుడు అన్నట్లుగానే తన సినిమాతోనే దర్శకుణ్ని చేశాడట. వీళ్లిద్దరి పరిచయం ఈనాటిది కాదు. సుశాంత్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కై పో చే’ నుంచే ఇద్దరూ కలిసి సాగుతున్నారట. ఆ చిత్రానికి ముకేష్ దర్శకత్వ శాఖలో పని చేశాడట. అప్పట్నుంచి ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని.. తనను అతను ఎంతగానో ప్రోత్సహించాడని.. ఎప్పటికైనా దర్శకుడిగా తొలి సినిమా తనతోనే ఉంటుందని చెప్పాడని.. ఆ హామీని నిలబెట్టుకుంటూ ‘దిల్ బేచరా’తో తనను డైరెక్టర్ని చేశాడని ముకేష్ వెల్లడించాడు.

సుశాంత్ కేవలం తన తొలి చిత్ర కథానాయకుడే కాదని.. అతను ప్రియమైన స్నేహితుడు కూడా అని.. తన కష్టాల్లో, సుఖాల్లో అన్నింట్లో తనకు తోడుగా ఉన్నాడని చెప్పాడు ముకేష్. తామిద్దరం కలిసి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నామని.. కలిసి ఎన్నో కలలు కన్నామని.. కానీ తన తొలి చిత్రం సుశాంత్ లేకుండా రిలీజవుతుందని ఎప్పుడూ అనుకోలేదని ముకేష్ అన్నాడు.

అతడి ప్రేమే ఇప్పుడు ‘దిల్ బేచరా’ సినిమాను రిలీజ్ చేసే విషయంలో గైడ్ చేస్తోందని.. ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూసేలా నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముకేష్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా సుశాంత్ పై నుంచి తన అందమైన నవ్వుతో తామందరినీ ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నట్లు ముకేష్ చెప్పాడు. ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ నిర్మించిన ‘దిల్ బేచరా’ వచ్చే నెల 24 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానున్నట్లు నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే.