ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే ఉపఎన్నికలు జరగబోతున్న హూజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్రంలోని సుమారు 30 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు జనాలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలు రాబట్టే ఎవరూ ఊహించని విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనాలకు అర్ధమైపోయింది.

హుజూరాబాద్ లో జరుగుతున్నట్లే తమ నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే అని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అందుకనే తమ ఎంఎల్ఏలను రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల రాజీనామాలకు చాలా బలంగా డిమాండ్లు వినబడుతున్నాయి.

ఇదిలా ఉంటే కరీనంగర్ జిల్లాలోని కరీనంగర్, చొప్పదండి, మానుకొండూరు, ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్, మంచిర్యాల ఎంఎల్ఏల రాజీనామాలకు జనాలు డిమాండ్లు చేస్తున్నారు. చివరకు సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావుకు కూడా రాజీనామా సెగ తప్పలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, తుంగతుర్తి ఎంఎల్ఏల రాజీనామాలకు పట్టుబడుతున్నారు.

ఇదే విషయమై గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనాలు తన రాజీనామాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి తన నియోజకవర్గం అభివృద్ధికి కేసీయార్ నిధులు కేటాయిస్తే వెంటనే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే రాజాసింగ్ మరచిపోయిన విషయం ఒకటుంది. గోషామహల్ అన్నది ఓల్డ్ సిటీలోని నియోజకవర్గం. కాబట్టి రాజాసింగ్ రాజీనామా చేసినా కేసీయార్ పట్టించుకునే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇక్కడంతా ఎంఐఎం ఆధిపత్యం నడుస్తోంది కాబట్టి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట ఎంఎల్ఏల రాజీనామాలకూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. నాగర్ కర్నూలు, సికింద్రాబాద్ లో కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. మంత్రులు, ఎంఎల్ఏల రాజీనామాలకు ముందు సోషల్ మీడియాలో జనాల నుండే డిమాండ్లు మొదలయ్యాయి. అవి బాగా వైరల్ అయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలతో పాటు వాటి అనుబంధ విభాగాల నేతలు కూడా అందుకున్నారు. తాజాగా కులసంఘాల నేతలు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత సుమారు 35 నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల రాజీనామాలకు డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుత డిమాండ్లు ముందు ముందు ఉద్యమరూపాన్ని తీసుకుంటే కేసీయార్ కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది. ఎలాగూ రాజీనామాలు చేసి మధ్యతర ఎన్నికలు జరిపించటంలో కేసీయార్ పెట్టిందిపేరు. 2018లో జరిగింది కూడా మధ్యంతర ఎన్నికలే. కాబట్టి మళ్ళీ తొందరలోనే మధ్యంతర ఎన్నికలు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.