రేవంత్ ప్లానింగ్.. ఆ నేతలంతా కాంగ్రెస్ గూటికే..!

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర్ర శేఖ‌ర్ కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌తో పొస‌గ‌క గ‌తంలోనే జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎర్ర‌శేఖ‌ర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త‌ను కాంగ్రెస్ లో చేర‌టం లాంఛ‌న‌మే కాగా… ఎంపీ అర‌వింద్ సోద‌రుడు సంజ‌య్ కూడా కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. డీఎస్ రాజ‌కీయంగా యాక్టివ్ గా లేక‌పోవ‌టంతో ధ‌ర్మ‌పురి సంజ‌య్ త‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇక భూపాల‌ప‌ల్లిలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ నుండి గెలిచిన గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌టంతో అక్క‌డ కాంగ్రెస్ కు పెద్ద నేత‌లు క‌రువ‌య్యారు. దీంతో గండ్ర‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అయ్యాయి. ఈ నేత‌లంతా త్వ‌ర‌లోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేర‌నున్నారు.