ఆర్కే దగ్గర సాక్ష్యాలు ఉన్నాయట.. కావాలంటే కేసు పెట్టుకోమన్నారు

ప్రతి వారాంతంలో తనదైన కామెంట్ తో భారీ పొలిటికల్ వ్యాసాన్ని రాసే అలవాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు ఉందన్న విషయం తెలిసిందే. వారం మొత్తమ్మీదా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఆయన విశ్లేషణ సాగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణతో పోలిస్తే.. ఏపీ మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జగన్ ను విమర్శించటం.. తప్పు పట్టటం లాంటివి తాము చేస్తున్నామని.. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపటంలో తప్పేముందన్న సమర్థింపు చేశారు.

నరసాపురం ఎంపీ రఘురామపై కేసు నమోదు చేయటం.. అరెస్టు సందర్భంగా ఆయనపై దాడి జరిగిందన్న ఆరోపణతో పాటు.. వివిధ న్యాయస్థానాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. తదనంతర పరిణామాల్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక అంశాన్ని వెల్లడించారు. రఘురామ కేసులో తమ ప్రభుత్వం ఏ స్థాయిలోనూ జోక్యం చేసుకోలేదంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ.. ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామపై దాడి జరగలేదని.. అందుకు తగిన వైద్య నివేదిక గుంటూరు ఆసుపత్రి ఇచ్చినట్లుగా తెలసిందే. అయితే.. రఘురామపై దాడి చేసిన పోలీసుల్ని రక్షించుకోవటం కోసం వైద్య నివేదికను అనుకూలంగా ఇవ్వాల్సిందిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లుగా పేర్కొన్నారు ఆర్కే తన వ్యాసంలో. అంతేకాదు.. ఈ ఉదంతానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని.. తన మీద కానీ.. ఏబీఎన్ మీద కానీ ఇంకో కేసు పెట్టుకోవచ్చంటూ ఆయన సవాలు మాదిరి వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే రఘురామ బెయిల్ పిటీషన్ పై సుప్రీం విచారణ సందర్భంగా రఘురామ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రఘురామపై దాడి జరగలేదని.. గాయాలు లేవని నివేదిక ఇచ్చిన అధికారికి.. ఏపీ అధికార పార్టీకి మధ్యనున్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీ నేతగా పేర్కొన్నారు. ఇలాంటివేళలో.. తాజాగా ఆర్కే తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు పెట్టుకోవచ్చన్న మాటను కూడా ఆయన చెప్పారంటే.. ఆయన దగ్గరున్న విషయం అంత పెద్దదా? అన్నది ప్రశ్నగా మారింది. మొత్తంగా రఘురామ ఎపిసోడ్ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు తావిచ్చేదిలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.