రఘురామ కేసులో ఉత్కంఠ రేపుతున్న ‘6 గంటలు’

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఐడీ పోలీసులు రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే రెబల్‌గా మారిన రఘురామ.. గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఈ మధ్య ఆయన విమర్శలు తీవ్ర స్థాయికి చేరడం, జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ కూడా వేయడంతో ప్రభుత్వం ఆయన మీదికి సీఐడీని ఉసిగొల్పినట్లుగా భావిస్తున్నారు. రఘురామ మీద కేసులు పెట్టిన సెక్షన్లు, ఆయన మీద మోపిన అభియోగాల మీద పెద్ద చర్చే నడుస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకునే సమయంలో, ఆ తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నపుడు ఆయనను తీవ్రంగా కొట్టినట్లుగా ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

రఘురామ పాదాలు బాగా కమిలిపోయిన ఫొటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కేసులు పెట్టడం, అరెస్టు చేయడం సంగతలా ఉంచితే.. పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, కేంద్రం నుంచి ‘వై’ కేటగిరి భద్రతను కూడా అందుకున్న ఒక ఎంపీని పోలీసులు కొట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పోలీసు ఉన్నతాధికారుల పైన వేటు పడటమే కాక ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి రావచ్చు. ఈ విషయమై కోర్టు తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఐతే రఘురామ పాదాలు అలా కందిపోవడానికి పోలీసులు కొట్టడం కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు సందేహం.

షుగర్, ఇతర అనారోగ్య కారణాలతో కూడా అలా కావచ్చని అంటున్నారు. పోలీసులు కొట్టడం వల్లే రఘురామ పాదాలు అలా మారాయా అన్నది తేల్చాలని వైద్య సిబ్బందిని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సందర్భంలో ఈ గాయాలు గత ఆరు గంటల వ్యవధిలోనే అయ్యాయా.. అన్నది తేల్చాలని కోర్టు సూచించింది. దీంతో ఈ ఆరుగంటల వ్యవధి అన్నది ఇప్పుడీ కేసులో కీలకంగా మారింది. ఐతే ఆ వ్యవధిలోనే రఘురామకు గాయాలైనట్లు తేలితే సీఐడీ, ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇస్తారా.. లేక వారిపై ఒత్తిడి పని చేసి తప్పుడు నివేదిక ఇస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది.