ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ) ఎత్తి వేసింది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది. ఒకే ర‌క‌మైన అభియోగాల‌పై రెండో సారి ఎలా స‌స్పెండ్ చేస్తార‌ని ప్ర‌శ్నించింది. త‌క్ష‌ణ‌మే ఈ స‌స్పెన్ష‌న్ను ఎత్తేసి.. ఆయ‌న వెంట‌నే పోస్టింగ్ ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో గ‌త రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఏబీ వెంక‌టేశ్వ‌రరావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కిన‌ట్టు అయింది. అంతేకాదు.. స‌స్పెన్ష‌న్ కాలంలో నిలిపివేసిజీత భ‌త్యాల‌ను కూడా తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది. ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల‌తో ఆయ‌న‌కు ఎలాంటి పోస్టు ఇస్తార‌నేది అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇదీ జరిగింది
వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌రరావు అప్ప‌టి టీడీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌మ వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని టీడీపీలోకి వెళ్లేలా ప్రోత్స‌హించి.. ఒత్తిడి తెచ్చార‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇది రాజ‌కీయం కావ‌డంతో ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి వైసీపీ అధికారంలోకి రావ‌డంతోనే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఆయ‌న కుమారుడు విదేశీ కంపెనీతో టై అప్ పెట్టుకుని.. ఆయుధాల వ్యాపారం చేశార‌నేది వైసీపీ స‌ర్కారు ఆరోప‌ణ‌. దీనికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌హ‌క‌రించార‌ని పేర్కొంది. దీంతో కొన్నాళ్లు.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు.

దీనిపై క్యాట్‌ను, హైకోర్టును ఆశ్ర‌యించిన వెంక‌టేశ్వ‌రరావు 2022-23 మ‌ధ్య కాలంలో స‌స్పెన్ష‌న్ ఎత్తేసేలా చేసుకున్నారు. అనం త‌రం ప్ర‌భుత్వం ఆయ‌న‌కు పోస్టింగ్ ఇచ్చింది. ప్ర‌భుత్వం ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ విభాగం డీజీగా ఆయ‌న‌ను నియ‌మించింది. అయితే.. ఆయ‌న ఫీల్డ్‌లోకి వెళ్లి.. కొన్ని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఆ త‌ర్వాత‌.. మూడు రోజుల్లోనే మ‌రోసారి స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. దీనిపై సుదీర్ఘం గా న్యాయ పోరాటం జ‌రిగింది. వాయిదాల‌పై వాయిదాలు ప‌డుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు.. తాజాగా ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ను ఎత్తేసింది. మొత్తంగా ఈ ఐదేళ్ల‌పాటు ఏబీ వెంక‌టేశ్వ‌రరావు న్యాయ పోరాటానికి.. స‌స్పెన్ష‌న్ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.