జగన్‌ను మెప్పించేందుకు.. మరీ స్థాయిలోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ప్రచార యావ గురించి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నెన్ని విమర్శలు చేసిందో గుర్తుండే ఉంటుంది. బాబుకు పబ్లిసిటీ పిచ్చని, అందుకోసం వందల కోట్లు తగలెడుతున్నారని జగన్ అండ్ కో విమర్శించారు. ఇంకా చాలా విషయాల్లో వృథా ఖర్చు గురించి జగన్ ఘాటు విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మీద బాబు అదనపు భారం మోపుతున్నారని అన్నారు.

ఇన్నేసి విమర్శలు చేశాక అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అలాంటి తప్పులేమీ చేయదని అంతా అనుకున్నారు. కానీ బాబుకు, జగన్‌కు తేడా ఏమీ కనిపించలేదు. పైపెచ్చు ప్రచార హడావుడిలో జగన్ సర్కారు రెండాకులు ఎక్కువే చదివిందన్న విమర్శలు వచ్చేలా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు వేయడం దగ్గర్నుంచి ఎన్నో విషయాల్లో జగన్ సర్కారు శ్రుతి మించే వ్యవహరించింది. ఈ మధ్య జగనన్న విద్యా కానుక అంటూ విద్యార్థులకు కిట్లు ఇచ్చి అందులో బెల్టుల మీద కూడా జగనన్న పేరు వేయడం గమనార్హం. ఇలా చాలా పథకాల విషయంలో చేశారు. జగన్ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని ఇలాంటి విపరీత చర్యలెన్నో చేస్తున్నారు.

ఇవి చాలవని తాజాగా జగన్ పేరును చిరస్థాయిగా నిలిపేందుకు ఏపీ సర్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. జగన్ బొమ్మలతో కూడిన సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయట ఏపీలో. ముందు భాగాన జగన్ బొమ్మ, వెనుక భాగాన బాణం గుర్తు ఉండేలా ఖరీదైన గ్రానైట్ రాళ్లపై చెక్కించి వాటిని సరిహద్దు రాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఐదు వేల గ్రానైట్ రాళ్లను ఆర్డర్ చేసే ప్రయత్నంలో ఉన్నారట. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు కావడం ఖాయం. జగన్‌ను మెప్పించేందుకు సర్వే అధికారులు ఇలా చేస్తున్నారా లేక ప్రభుత్వం నుంచే ఇందుకు ఆదేశాలు వచ్చాయా అన్నది తెలియదు కానీ.. జనం డబ్బులతో రాజకీయ నాయకులు చేసుకునే పబ్లిసిటీలో ఇది కొత్త దుస్సంప్రదాయం అవుతుందనడంలో సందేహం లేదు.