20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి-జగన్

ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని పదే పదే జగన్ చెప్పుకుంటుంటే.. జగన్ విస్మరించిన హామీలంటూ ఆయన ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలనే షేర్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

జగన్ మాట తప్పిన హామీల్లో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, మెగా డీఎస్సీ నిర్వహించడం.. లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం ప్రధానమైనవి. ఈ హామీని జగన్ నిలుపుకోలేకపోయాడన్నది స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తిగా జగన్ విస్మరించాడని.. అదే సమయంలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేటులోనూ ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఐతే సచివాలయ ఉద్యోగులకు తోడు వాలంటీర్లను, ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా కలిపేసి ఆరున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ సర్కారు ఘనంగా ప్రకటనలు ఇచ్చుకోవడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది చాలదన్నట్లు తాజగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో జగన్ ఉద్యోగాల కల్పన గురించి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తోంది. తమ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు తోడు.. అదనంగా ఎంఎస్ఎంఈల ద్వారానే 20 లక్షల మందికి ఉపాధి దొరికిందని జగన్ ఘనంగా ప్రకటించుకోవడం గమనార్హం.

ఈ మాట అనగానే ఇంటర్వ్యూయర్.. “20 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో” అని నొక్కి చెప్పగా “ఎస్.. ఎస్..’ అంటూ జగన్ ఇంకా బలంగా ఈ మాటను చెప్పడం విశేషం. ఐతే అధికారిక గణాంకాలు లేకుండా నోటి మాటగా 20 లక్షల మందికి ఉపాధి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేయడంతో ఏపీ సీఎంపై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ జరుగుతోంది.