ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది కూడా నామ‌మాత్రంగానే. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 30 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా.. ఏనాడూ ఆయ‌న స‌తీమ‌ణి విజ‌యమ్మ బ‌య‌ట‌కు రాలేదు. క‌నీసం జెండా కూడా ప‌ట్టుకోలేదు. చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అంతే. ఇక‌, అన్న‌గారు ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ తారకం కూడా.. ఏనాడూ బ‌య‌ట‌కు వ‌చ్చి.. పార్టీ కోసం ప‌నిచేయ‌లేదు. క‌నీసం ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గమ‌నార్హం.

కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. భార్య‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో హోరా హోరీ త‌ల‌ప‌డుతున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. భార్య‌ల‌ కోసం భ‌ర్త‌లు రంగంలోకి దిగుతుండ‌డం. ఇది రివ‌ర్స్ అన్న‌మాట‌. తమ భార్య‌ల గెలుపు కోసం.. ఎండ‌ల‌ను కూడా లెక్క చేయ‌కుండా.. భ‌ర్త‌లు.. ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. ఉన్న‌ప‌నులు కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ.. పోటీలో ఉన్న భార్యా మ‌ణి విజ‌యం కోసం త‌పిస్తున్నారు.

పురందేశ్వ‌రి: బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం నుంచి బ‌రిలో ఉన్నారు. అయితే.. ఈమె క‌న్నా.. ఈమె భ‌ర్త‌, సీనియ‌ర్ నాయ‌కుడు..ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌రిలో ప్ర‌చారం చేస్తున్నారు. రాజ‌మండ్రిలోనే కొన్ని వారాలుగా తిష్ఠ వేసిన ఆయ‌న భార్య గెలుపు కోసం.. మేదావుల‌ను క‌లుస్తున్నారు. విద్యావంతుల‌తో భేటీ అవుతున్నారు. సైలెంట్ ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. మండ‌ల‌స్థాయిలో చ‌క్క‌బెడుతున్నారు.

వేమిరెడ్డి ప్ర‌శాంతి: నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై బ‌రిలో ఉన్న వేమిరెడ్డి ప్ర‌శాంతి కోసం.. ఆమె భ‌ర్త‌, నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. త‌న గెలుపు కన్నా.. త‌న భార్య కోసం ఆయ‌న చెమ‌టోడుస్తున్నారు. వారానికి మూడు రోజులు కోవూరులోనే ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతో అనేక హామీలు కూడా గుప్పిస్తున్నారు. ఇక్కడ గెలుపు కీల‌క‌మ‌ని భావిస్తున్నారు.

ఆర్కే రోజా: వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ త‌ర‌ఫున ఉన్న గాలి కుటుంబంపై ఈమె పోరాడుతున్నారు. గ‌తంలో రెండు సార్లు విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఫైట్ ట‌ఫ్ అని తేల‌డంతో భ‌ర్త సెల్వ‌మ‌ణి రంగంలోకి దిగారు. మీడియా మీటింగులు.. మేధావి వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ఎలాగూ ద‌ర్శ‌కుడు కావ‌డంతో షార్ట్ ఫిల్మ్‌లు తీసి.. సోష‌ల్ మీడియాలో రోజాకు అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నారు త‌మిళ‌నాడు బోర్డ‌ర్ మండ‌లాల్లో స్వ‌యంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎండ కూడా లెక్క‌చేయ‌కుండా.. దూసుకుపోతున్నారు. ఇక, రోజా ఇద్ద‌రు అన్న‌లు కూడా.. రంగంలోనే ఉన్నారు. వారు కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

మురుగుడు లావ‌ణ్య‌: మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో ఉన్న వైసీపీ నాయ‌కురాలు మురుగుడు లావ‌ణ్య‌. ఈమె కోసం అటు మామ‌గారు… ఇటు మాతృమూర్తి కూడా.. శ్ర‌మిస్తున్నారు. ఇక‌, భ‌ర్త అయితే.. ఇంటింటికీ తిరుగుతున్నారు. గెలిపించాల‌ని కోరుతున్నారు.

విడ‌ద‌ల ర‌జ‌నీ: వైసీపీ మంత్రిగా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ గుంటూరులో వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్నారు. ఈమె కోసం.. ఆమె భ‌ర్త తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఇక్క‌డ ఇద్ద‌రూ మ‌హిళ‌లే త‌ల‌ప‌డుతున్నారు. టీడీపీ నుంచి పిడుగురాళ్ల మాధ‌వి బ‌రిలో ఉన్నారు. దీంతో ఈమె కుటుంబం నుంచి కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రి ఏమేర‌కు.. భ‌ర్త‌ల ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో చూడాలి.