హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా రాష్ట్రాలలో నెలకొన్న వివిధ పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయా వర్గాలలో గూడు కట్టుకున్న ఆవేదన, ఆగ్రహం ఈ ఎన్నికలలో తమ విజయం మీద ప్రభావం చూపుతుందేమో అన్న భయం బీజేపీ పార్టీలో నెలకొన్నది.

హర్యానా రాష్ట్రంలో 2014 లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 10 స్థానాలలో బీజేపీ ఏడు, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) రెండు, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఏకంగా 58 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 10కి 10 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.

2019 లోక్ సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఓట్లు 58 శాతం నుండి 36 శాతానికి పడిపోయాయి. 90 శాసనసభ స్థానాలకు గాను 75 గెలుచుకుంటామన్న నినాదంతో పోటీ చేసిన బీజేపీ 7 స్థానాలు కోల్పోయి 40 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు అదనంగా గెలుచుకుని 31 స్థానాలు సాధించింది. ఎన్నికల అనంతరం 10 స్థానాలలో గెలిచిన జననాయక్ జనతాపార్టీ, ఏడుగురు స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు పదేండ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ – ఆమ్‌ ఆద్మీ పార్టీ కూటమి ప్రయత్నిస్తున్నది. అయితే గత ఎన్నికల తర్వాత కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేయగా కేంద్రం దానిని అణచివేసింది. ఇప్పటి వరకు రైతుల డిమాండ్లు నెరవేర్చలేదు.

హర్యానాలో రైతులు ఎక్కువగా జాట్‌ సామాజకవర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో వీరి జనాభా 26 శాతం వరకు ఉంది. ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో జాట్‌లే గెలుపోటములను నిర్ణయిస్తారు.వీటితో పాటు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో రెజ్లర్లు ఆందోళనకు దిగడం, వారి పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం, తిరిగి బీజేపీ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి టికెట్‌ ఇవ్వడం అంశాలతో పాటు, సైన్యంలో చేరేందుకు కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కూడా బీజేపీకీ ప్రతికూలంగా మారింది.

బీజేపీకి ఉన్న ప్రతికూల అంశాలను సద్వినియోగం చేసుకొని హర్యానాలో పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నది. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ ఇక్కడ కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. అయితే అభయ్‌ సింగ్‌ చౌతాలా నాయకత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ, దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)లు ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు రైతులు, జాట్లలో పట్టుంది. దుష్యంత్‌ చౌతాలాకు యువతలోనూ ఆదరణ ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు సాధించే ఓట్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల విజయావకాశాలను నిర్ణయిస్తాయి. మరి హర్యానా తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాలి.