ఏపీలో పింఛ‌న్ల ర‌గ‌డ‌.. చంద్ర‌బాబు కొత్త పాయింట్ !

మే 1వ తేదీకి మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డం.. ఇంటింటికీ వెళ్లి  ఇచ్చే పింఛ‌న్ల వ్య‌వ‌హారం నిలిచిపోవ‌డం నేప‌థ్యంలో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల నేప‌థ్యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌స్తుతం స‌స్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండ‌లు త‌ట్టుకోలేక‌.. పింఛ‌న్ల కోసం వ‌చ్చిన వారు.. దాదాపు 32 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతున్నాయి.

పైగా ఈ వ్య‌వ‌హారం రాజకీయ దుమారం రేపింది. మ‌ర‌ణాలు.. మా లెక్క కాదు.. టీడీపీ పాప‌మేన‌ని వైసీపీ చెబితే.. మాది కాదువారిదే అని ఎదురుదాడి టీడీపీ నుంచి వ్య‌క్త‌మైంది. ఎలా చూసుకున్నా.. న‌ష్ట‌పోయింది మాత్రం ఆయా కుటుంబాలే. ఇక‌, ఇప్పుడు మే 1వ‌చ్చింది. ఈ క్ర‌మంలో విపక్షాల నుంచి ఇంటింటికీ తీసుకువెళ్లి పింఛ‌న్లు ఇవ్వాల‌నే డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచే ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంపై ఇటు ఎన్నిక‌ల సంఘానికి, అటు ప్ర‌భుత్వానికి కూడా విన్న‌వించాయి.

కానీ, ప్ర‌తిప‌క్షాలు చెప్పిన‌ట్టు ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. కేవ‌లం మంచంలో ఉన్న రోగుల‌కు మాత్ర‌మే ఇంటింటి పంపిణీ చేస్తామ‌ని తెలిపింది. మిగిలిన వారికి బ్యాంకుల్లో వేస్తామ‌ని చెప్పింది. అయితే.. అస‌లు మ‌త‌ల‌బు అంతా ఇక్క‌డే ఉంది. గ‌తంలో స‌చివాల‌యాల్లో ఇచ్చిన‌ప్పుడే.. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు బ్యాంకులో వేయ‌డం అంటే. మ‌రింత న‌ర‌కం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు.

బాబు.. కొత్త పాయింట్ లేవ‌నెత్తారు. రాష్ట్రంలో సుమారు 65 ల‌క్ష‌ల మంది పింఛ‌ను దారులు ఉన్నార‌ని.. వారి బ్యాంకు అకౌంట్లు త‌మ వ‌ద్ద‌లేవ‌ని.. గ‌త నెల‌లోనే ప్ర‌భుత్వం చెప్పింద‌ని.. కానీ, ఇప్పుడు 48 ల‌క్ష‌ల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న‌ట్టు ఎలా చెబుతుంద‌న్న‌ది బాబు ప్ర‌శ్న‌. కాబ‌ట్టి ఇదంతా ఉద్దేశ పూర్వ‌క‌మే నని.. ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌న్న‌.. త‌మ డిమాండ్ నెర‌వేర్చి తీరాల్సిందేన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, ఎన్నిక‌ల సంఘం త‌మ‌కు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌ని చెప్ప‌లేద‌న్న‌ది ప్ర‌భుత్వ వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.