బీఫారాలు ఇచ్చేశారు..జెండాల‌ను త‌గుల బెట్టారు

టీడీపీలో కీల‌క ఘ‌ట్టానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు తెర‌దీశారు. కూట‌మిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాల‌కు టీడీపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్ర‌బాబు 144 మంది అభ్య‌ర్థులకు పార్టీ త‌ర‌ఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాల‌కు కూడా.. ఆయ‌న ఆయా అభ్య‌ర్థుల‌కు బీఫారాలు అందించారు. ఉండ వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌రిగిన కార్యక్ర‌మంలో ఈ బీ ఫారాల‌ను అంద‌జేశారు.

అయితే.. వీరిలో కొంద‌రికి చ‌డీచ‌ప్పుడు లేకుండా.. ఈ రోజు ఉద‌య‌మే స‌మాచారం అందించి.. నియోజ క‌వ‌ర్గాల్లో మార్పులు చేయ‌డంతో ఆయా స్థానాల్లో మంట‌లు రేగాయి. మ‌డ‌క‌శిర‌, మాడుగుల‌, ఉండి, పాడేరులలో అభ్య‌ర్థుల‌ను మార్చారు. దీంతో ఆయా స్థానాల్లో ఇప్పటికే టికెట్ ప్ర‌క‌టించి.. ప్ర‌చారంలో ఉన్న అభ్య‌ర్థులు చంద్ర‌బాబు చిత్ర‌ప‌టాల‌పై రాళ్లు రువ్వి.. తీవ్ర ర‌చ్చ సాగించారు. బ్యాన‌ర్లు, పార్టీ జెండాల‌ను త‌గుల బెట్టారు.

మ‌డ‌క‌శిర‌లో సునీల్ ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. తాజాగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎంఎస్ రాజుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది ఇక్క‌డ మంట‌లు రేపింది. ఇక‌, ఉండిలో ఇప్ప‌టికే ప్ర‌చారంలో దూకుడుగా ఉన్న మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి ర‌ఘురామ‌రాజుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది కూడా.. పార్టీలో మంట‌లు రేపింది. పార్టీ నాయ‌కులు కార్యాల‌యానికి తాళాలు వేసి.. జెండాలు పీకేసి వెళ్లిపోయారు. ఇక‌, పాడేరులోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ట‌కెట్‌ను చ‌డీ చ‌ప్పుడు లేకుండా.. గిడ్డి ఈశ్వ‌రికి ప్ర‌క‌టించారు.

ఇక‌, త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌న్న బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తికి.. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల స్థానం ఇచ్చారు. అయితే.. ఇక్క‌డ ఆల్రెడీ ఎన్నారై పైలా ప్ర‌సాద్ రూ. కోట్లు ఖ‌ర్చు పెట్టుకుని ప్ర‌చార వాహ‌నాలు ఏర్పాటు చేసి.. ప్రచారంలో ఉన్నారు. దీంతో తాజా మార్పు ఆయ‌న‌లోనూ మంట‌లు రేపింది. దీనికితోడు.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో కోడ‌లిని కాద‌ని.. మ‌ళ్లీ మామ‌కే కురుగుండ్ల రామ‌కృష్ణ‌కు చంద్ర‌బాబు చాన్సిచ్చారు. ఇక్క‌డ మాత్ర‌మే అసంతృప్తి లేదు. మ‌రి మిగిలిన‌ స్థానాల్లోనూ.. పార్టీలో అసంతృప్తి నెల‌కొంది. ఏదేమైనా చంద్ర‌బాబు అనుకున్న‌ది చేశారు. త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.