న్యూస్ ఎక్స్ సర్వే: ఏపీ కూటమిదే!

సార్వత్రిక ఎన్నికల వేళ పలు మీడియా సంస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు సైతం పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా న్యూస్ ఎక్స్ ఆంగ్ల వార్తా చానల్ డిజిటల్ ఎడిషన్ కు సంబందించిన సర్వేను తాజాగా ప్రకటించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్న 400 స్థానాలకు పైబడిన సీట్ల సాధన ఏ మేరకు సాధ్యమన్న విషయాన్ని తేల్చేయటంతో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

మొత్తంగా చూస్తే.. ఈ సర్వే ప్రకారం మోడీ కల నెరవేరదు. ఆయన కూటమి మొత్తం కూడా 400 కంటే తక్కువ స్థానాలకే పరిమితం కానుంది. అయితే.. 370 స్థానాల్నిమాత్రం దాటేయం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేసింది. తనకు తానుగా సొంతంగా అన్ని స్థానాలు గెలుచుకునే వీల్లేనప్పటికీ.. మిత్రపక్షాలతో కలిసి ఆ లక్ష్యాన్ని దాటేయటం సులువుగా తేల్చింది.

ఈ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో టీడీపీ.. బీజేపీ.. జనసేన కూటమికి 18 సీట్లు వస్తాయని.. అధికార వైసీపీకి 7 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 14 స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ.. జనసేనలు రెండేసి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చింది. తాజాగా నిర్వహించిన ఓపీనియన్ పోల్ ద్వారా తామీ ఫలితాల్ని వెల్లడిస్తున్నట్లుగా పేర్కొంది.

గత ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏడు ఎంపీ స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుందని.. అదే సమయంలో కూటమి స్పష్టమైన అధిక్యతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. మొత్తం 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ కు 8 స్థానాలు వస్తాయని.. బీజేపీకి 5 స్థానాలు వచ్చే వీలుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మూడు స్థానాలు.. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంటుందని పేర్కొంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమితో సహా 383 స్థానాలు చేజిక్కించుకుంటుందని పేర్కొనగా.. బీజేపీ సొంతంగా 325 స్థానాల్ని గెలుచుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి 109 స్థానాల్ని గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ఇతరులు 51 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేశారు.