అప్పుడేమో ధ‌ర్నాచౌక్‌కు నో.. ఇప్పుడేమో దీక్ష‌కు సై

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. మార్పులు అనివార్యం. ఈ విష‌యం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలిసొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు ఉద్య‌మాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. అధికారంలోకి వ‌చ్చాక ఉద్య‌మాల‌ను అణ‌చివేశారు. ఇక ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ప‌థకాలు అమ‌లు చేయ‌క‌పోతే పోరుబాట ప‌డ‌తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు ధ‌ర్నాచౌక్‌నే ఎత్తేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దీక్ష‌లకు సై అంటున్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్ర‌భుత్వ పాల‌న‌లోనైనా ప్ర‌జ‌ల‌కు కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంది. కొన్ని డిమాండ్లు నెర‌వేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. స‌మ‌స్య‌ల పరిష్కారం కోసం ఆందోళ‌న చేయాల్సి వ‌స్తుంది. ప్ర‌జాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేసే హ‌క్కు అంద‌రికీ ఉంది.

అందుకు 2000 నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు స‌మీపంలో ధ‌ర్నాచౌక్ వేదిక‌గా మారింది. ఇక్క‌డ ఆందోళ‌న చేస్తే అది ప్ర‌భుత్వానికి తెలుస్తుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంది. కానీ కేసీఆర్ మొద‌టి సారి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఈ ధ‌ర్నాచౌక్‌నే ర‌ద్దు చేశారు. 2017లో హైద‌రాబాద్ న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ర‌క్ష‌ణ కోస‌మే ధ‌ర్నాచౌక్‌ను ఎత్తివేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌భుత్వం పేర్కొంది. న‌గ‌రం బ‌య‌ట ఆందోళ‌న‌లు చేసుకోవాలంది.

కానీ కేసీఆర్ తీరుపై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింది. హైకోర్టు కూడా మొట్టికాయ‌లు వేసింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ధ‌ర్నాచౌక్‌ను కొన‌సాగించాల్సి వ‌చ్చింది. అయినా ఎప్ప‌టిక‌ప్పుడూ కేసీఆర్ ప్ర‌భుత్వం అక్క‌డ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌పై ఆంక్ష‌లు పెట్టింది. ఇక వ‌రి కొనుగోళ్ల‌పై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వైఖ‌రికి వ్య‌తిరేకంగా కేసీఆర్ అండ్ కో ధ‌ర్నాచౌక్‌లోనే ధ‌ర్నా చేసిన సంగ‌తి తెలిసిందే.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ధ‌ర్నాచౌక్‌లో ఆంక్ష‌లు ఎత్తివేసింది. ఇప్పుడిక కేసీఆర్ ఏమో కాంగ్రెస్ పాల‌న వైఫ‌ల్యాల‌పై ఆందోళ‌న చేస్తా అని చెబుతున్నారు. ద‌ళిత బంధు చెక్కుల్ని వెన‌క్కి తీసుకోవ‌డంపై ద‌ళిత బిడ్డ‌ల‌తో క‌లిసి అంబేడ్క‌ర్ విగ్ర‌హం ద‌గ్గ‌ర దీక్ష చేస్తా అని ప్ర‌క‌టించారు. కానీ కేసీఆర్‌.. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఉద్య‌మం చేస్తే ద‌య లేకుండా తొక్కేసింది నిజం కాదా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అందుకే అధికారం ఉంద‌నే గ‌ర్వం ప‌నికిరాద‌ని అంటున్నారు.