గెలుపు కాదు చీల్చ‌డ‌మే ప్లాన్‌!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా చేయ‌డంతో కాంగ్రెస్‌పై ఏపీ ప్ర‌జ‌ల‌కు తీవ్ర‌మైన ఆగ్ర‌హం ఉంది. ఈ విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డమే అందుకు రుజువు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేదే క‌నుమ‌రుగ‌యే ప‌రిస్థితి త‌లెత్తింది.  ఈ నేప‌థ్యంలో ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా వైఎస్ ష‌ర్మిల ఆ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌కు ఆద‌ర‌ణ పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంతో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ హ‌స్తం పార్టీని తిరిగి ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటూ సాగుతున్నారు. కానీ ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఒక్క‌సారిగా పుంజుకుంటుంద‌నే అంచ‌నాలు లేవు. అయితే త‌మ గెలుపు ముఖ్యం కాదు ఓట్ల‌ను చీల్చి వైసీపీని ఓడించ‌డ‌మే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంద‌నే చెప్పాలి.

ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ అధికార వైసీపీ.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి మ‌ధ్య ఉండ‌నుంది. అయితే ఈ కూట‌మిపై వ్య‌తిరేక‌త‌తో త‌ట‌స్థ ఓట‌ర్లు కొంత‌మంది వైసీపీ వైపు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. ఆ ఓట్ల‌ను కాంగ్రెస్ సాధించ‌గ‌లిగితే అప్పుడు వైసీపీకి గ‌ట్టి దెబ్బ త‌గులుతుంది. ష‌ర్మిల కూడా ఇదే వ్యూహంతో ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థ‌ర్‌, ఎలీజా, చిట్టిబాబు, ఎంఎస్ బాబు కాంగ్రెస్లో చేరి పోటీకి సిద్ధ‌మయ్యారు. మ‌రికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్కు మెరుగైన అభ్య‌ర్థులే ఉన్నారు.

ఇలా ఓ 40 స్థానాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్తుల‌ను పార్టీ నిల‌బెట్టింది. అయితే వీళ్ల బ‌లం గెల‌వ‌డానికి స‌రిపోక‌పోయినా ఓట్లు చీల్చ‌డానికి మాత్రం ప‌నికొస్తుంద‌నే చెప్పాలి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో 15 వేల ఓట్లు వ‌ర‌కూ సంపాదించినా అది వైసీపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌తికూలంగా మారే అవ‌కాశ‌ముంది. అంత‌టి ప్ర‌భావం చూపే వాళ్ల‌నే కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓ నాలుగైదు శాతం ఓట్లు చీల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే అది ఏ పార్టీకి న‌ష్టంగా మారింద‌న్న‌ది తేలుతుంది.