కొత్త నాయకులను తయారుచేసుకుంటాం – కేటీఆర్

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన బీఆర్ ఎస్ పార్టికి ప్ర‌స్తుతం క‌ష్ట కాలం న‌డుస్తోంది. ఒక్కొక్కరుగా కాదు.. మంద‌లు మంద‌లుగా నాయ‌కులు పారిపోతున్నారు. పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఎవ‌రికైనా.. ఏ పార్టీ అధినేత‌కైనా.. ఒకింత బాధ‌గానే ఉంటుంది. ఇదే బాధను బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న కొంత ప‌దునైన వ్యాఖ్య‌లే వాడారు. “పోతున్న వారంతా రాజ‌కీయ బేహారులు” అని తిట్టిపోశారు.

“శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్. ఒక్కడుగా బయల్దేరి, లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడు కేసీఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి… తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. పార్టీలో నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాటపంథాలో కదం తొక్కుదామని ఆయన  పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకు న్న ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సైతం బీఆర్ ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయ‌న కూడా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలావుంటే.. కేటీఆర్ వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.