ఆ కంటైనర్ లో ఏముంది జగన్?

ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళగిరి పోలీసులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసులోకి భారీ కంటైనర్ వెళ్ళినా తనిఖీలు చేయకపోవడంపై లోకేష్ స్పందించారు. అంతేకాకుండా, ఆ కంటైనర్ రాంగ్ రూట్లో వెళ్లినా భద్రతా సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎందుకు వచ్చింది? ఏం తెచ్చింది? అని లోకేష్ ప్రశ్నించారు.

ఈ కంటైనర్ రాకలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన పోలీసులకు కనిపించడం లేదా అని లోకేష్ నిలదీశారు. ఆ కంటైనర్ లో బ్రెజిల్ సరుకు ఉందా లేక లిక్కర్ అమ్మి సంపాదించిన వేల కోట్ల డబ్బు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. లేదంటే జగన్ లండన్ పారిపోయేందుకు ఏర్పాటు జరుగుతున్నాయా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నలకు ఏపీ డీజీపీ సమాధానం చెబుతారా అనే లోకేష్ ప్రశ్నించారు.

మరోవైపు, రేణిగుంటలో వైసీపీ నేతకు చెందిన గోడౌన్ లో ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలు వంటి 52 రకాల వస్తువులను అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై కూడా లోకేష్ స్పందించారు. జగన్ ను ప్రజల శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయించుకున్నారని, అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్ తో, తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వస్తువుల డంప్ ను అధికారులు టీడీపీ నేతల ఫిర్యాదుతో పట్టుకున్నారని, ఇసుక, లిక్కర్ వ్యాపారంలో జగన్ దోచుకున్న కోట్ల రూపాయల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. జగన్ పై ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా వారి ఆగ్రహ జ్వాల చల్లారదని, ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేష్ అన్నారు.