సీఎం ర‌మేష్‌పై పోటీ చేసే వైసీపీ నేత ఈయ‌నే..

ఏపీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌క అడుగు వేసింది. ఆచి తూచి అభ్య‌ర్థిని ఎంచుకుంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని కీల‌క‌మైన అన‌కాప‌ల్లి స్థానానికి బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా సీఎం ర‌మేష్ ను ప్ర‌క‌టించారు. ఈయ‌న వెల‌మ నాయుడు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీటును పెండింగులో పెట్టిన వైసీపీ.. తాజాగా కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే  175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సిట్టింగ్ స్థానంలోనే తొలుత ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో మాడుగుల స్థానానికి ఆయ‌న‌ కుమార్తె ఈర్లి అనురాధను ఎంపిక చేశారు.  

ఇదే స‌మ‌యంలో అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ,వైసీపీ నాయ‌కురాలు బీవీ సత్యవతిని వైసీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టేసింది.  ఇటు సామాజికంగా, అటు ఆర్థికంగా బలమైన ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పి.రమాకుమారి పేరును మొదట సీఎం జ‌గ‌న్ పరిశీలించారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కూటమి పార్టీలు ప్రకటించడంతో వైసీపీ అధి ష్ఠానం ఇక్కడ ఒక్కచోట మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థిని నిర్ణయంచాలని అనుకున్నారు. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో సీఎం రమేష్‌ పేరును ఖరారు చేశారు.

దీంతో వెల‌మ నాయుడు వ‌ర్గానికి చెందిర ర‌మేష్‌పై కొప్పుల వెల‌మ‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీగా బరిలోకి దింపారు. ఇక‌, బూడి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధను మాడుగుల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీకి అవకాశం ఇవ్వడంతో ఆయన అంగీకరించారు. అనకాపల్లి ఎంపీ స్థానంలో వెలమ వర్గానికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఈ కారణంగా సీఎం రమేష్ కడపకు చెందిన నేత అయినా అనకాపల్లిలో  పోటీకి ఆసక్తి చూపించారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపడంతో.. ఆసక్తికర పోరు సాగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఇదేస‌మ‌యంలో లోక‌ల్, నాన్ లోక‌ల్ నినాదం కూడా నియోజ‌క‌వ‌ర్గంలో హోరెత్తే అవ‌కాశం ఉంది. ర‌మేష్ నాన్ లోక‌ల్‌, బూడి ముత్యాల‌నాయుడు లోక‌ల్ కావ‌డంతో ఇది కూడా వైసీపీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది. నిజానికి గవర లేదా కాపు వర్గానికి సీటు ఇస్తే.. .వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా కొప్పుల వెలమ అభ్యర్థినే నిలబెట్టాలని డిసైడ్ అయి.. ఉపముఖ్యమంత్రిని రంగంలోకి దించారు.  చూడాలి ఎవ‌రు గెలుస్తారో!!