మైనారిటీ స్థానంలో బీసీల‌కు చోటు.. కేసీఆర్ వ్యూహమేంటి?

ప‌క్కా మైనారిటీ స్థానంగా పేరొందిన హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానానికి బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ బీసీ నేత‌ను ప్ర‌క‌టించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక‌.. అనేక చ‌ర్చ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ పేరును ప్రకటించారు.

కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. బీజేపీ మాత్రం హైద‌రాబాద్ సీటును మాధ‌వీల‌త కు కేటాయించింది. ఆమె ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ లో ఆమె దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుంటే.. అనూహ్యంగా కేసీఆర్ హైద‌ర‌బాద్‌కు బీసీకి చెందిన శ్రీనివాస్ యాద‌వ్‌ను ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. వాస్త‌వానికి మైనారిటీ నాయ‌కులు చాలా మందే ఉన్నారు.

కానీ, వారెవరినీ.. కేసీఆర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. క‌నీసం ఎవ‌రిని సంప్ర‌దించారో కూడా తెలియ‌దు కానీ.. అనూహ్యంగా శ్రీనివాస్ య‌ద‌వ్ పేరును మాత్రం ప్ర‌క‌టించారు. అయితే.. ముస్లిం మైనారిటీ పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ త‌న బంధాన్నికొన‌సాగిస్తున్నారు. ఈ పార్టికి హైద‌రాబాద్ కంచుకోట‌. గ‌తం నుంచి ఈ పార్టీనే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మైనారిటీ నేత‌కు కాకుండా.. బీసీ కి ఇవ్వ‌డం ద్వారా కేసీఆర్ ఎంఐఎంకు ప‌రోక్ష స‌హ‌కారం అందిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎంఐఎంపై అసంతృప్తి ఉన్న‌వారు.. బీసీలు.. ఓట్లు చీలిపోయి.. ఎంఐఎంకి మేలు చేయాల‌న్న వ్యూహంతో నే కేసీఆర్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నేరుగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోకుండా.. చేతులు మాత్ర‌మే క‌లిపిన బీఆర్ఎస్‌.. ఆ పార్టీ కోసం..ఈ టికెట్‌ను ఇలా ప‌రోక్షంగా త్యాగం చేసింద‌ని చెబుతున్నారు. బీసీ నేత‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇచ్చి.. ఎంఐఎం వ్య‌తిరేక ఓటును బీజేపీకి ప‌డ‌కుండా చేయ‌డమే దీని వెనుక వ్యూహంగా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.