ద‌గ్గుబాటికి సోము క‌ష్టాలు.. పొలిటిక‌ల్ టాక్‌

రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్ర‌క‌టించిన జాబితాలో ఆమెకు రాజ‌మండ్రి టికెట్‌ను ఖ‌రారు చేశారు. వాస్తవానికి ఆమె విశాఖ‌ను ప‌ట్టుబ‌ట్టారు. కానీ, టీడీపీ అధినేత ఈ సీటును వ‌దులుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో ఆమె మ‌న‌సుతోపాటు సీటును కూడా రాజ‌మండ్రికి మార్చుకున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. పురందేశ్వ‌రి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌కు కొత్త క‌ష్టాలు వెంటాడుతున్నాయి.

అదే.. పార్టీ మాజీ చీఫ్‌, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు రూపంలో పురందేశ్వ‌రికి రాజ‌కీయ స‌వాల్ ఎదురుకానుంది. ఎలాగంటే.. ఇదే రాజ‌మండ్రి టికెట్‌ను సోము కూడా ఆశించారు. ఇక్క‌డ నుంచి గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని ఆయ‌న పార్టీ అధిష్టానం ద‌గ్గ‌ర కూడా చెప్పారు. కానీ, అధిష్టానం మాత్రం పురందేశ్వరి వైపే మొగ్గు చూపింది. తొలినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోము వీర్రాజును కాదని పురందేశ్వరికి టికెట్ ఇచ్చింది. ఇదే.. సోము వ‌ర్గంలో మంట‌లు రేపుతోంది.

మరోవైపు టిడిపి శ్రేణులు.. పురందేశ్వరి కోసం తమను బలి చేస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి కార‌ణం.. రాజమండ్రి పార్లమెంట్ సీటును టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ సీటును బొడ్డు త్యాగం చేశారు. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే… అదీ దక్కలేదు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని బొడ్డు వెంకట రమణ వాపోతున్నారు.

పురందేరేశ్వరికి రాజమండ్రి టికెట్‌ కన్ఫామ్‌ కావడంతో సొంత పార్టీలోనే అసమ్మతి మొద‌లైంది. సోము వీర్రాజు వర్గం… పురందేశ్వరికి ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టిడిపిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిజెపికి టిక్కెట్ కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను కలుపుకుని బిజెపి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.