ఇబ్బందులు తప్పవా బ్రో

ఒకే నిర్మాణ సంస్థ నుంచి పలు సినిమాలు వస్తున్నప్పుడు ఒక డిజాస్టర్ ప్రభావం ఖచ్చితంగా తర్వాత రాబోయే వాటి మీద ఉంటుంది. నష్టాలను సర్దుబాటు చేసే క్రమంలో రేట్లు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఆదిపురుష్ ని ఎక్కువగా అంచనా వేసి 185 కోట్లకు కొనేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మొత్తం రికవరీ అయ్యే సూచనలు తగ్గిపోతున్నాయి. రోజు రోజుకి రెవిన్యూ డ్రాప్ మరీ ఎక్కువైపోవడంతో వీకెండ్ మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎంత వీక్ డే అయినా క్రాస్ రోడ్స్ రెండు థియేటర్లలో ప్రభాస్ కి అయిదో రోజే డెఫిషిట్ రావడం ఇదే మొదటిసారి

ఇప్పుడీ పరిణామం నేరుగా బ్రో మీద పడొచ్చని ట్రేడ్ టాక్. ఎందుకంటే దీని నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. బిజినెస్ డీల్స్ ఇటీవలే మొదలుపెట్టారు. రేట్లు ఎక్కువ చెప్పడంతో ట్రైలర్ వచ్చే దాకా ఆగాలని బయ్యర్లు నిర్ణయించుకోవడంతో ప్రస్తుతానికి పూర్తి స్థాయి ఒప్పందాలు జరగలేదు. ఆదిపురుష్ ని పంపిణి చేసింది పీపుల్స్ మీడియానే కాబట్టి వచ్చిన లాస్ కి బదులుగా డిస్ట్రిబ్యూటర్లు బ్రోని కాస్త డిస్కౌంట్ లోఇమ్మని అడిగే అవకాశాలు లేకపోలేదు. అయితే బ్రో భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ కాదు కనక ఒకవేళ తగ్గించినా ఇబ్బంది లేదు.

ఇంకా బ్రో షూటింగ్ పూర్తి కాలేదు. సాయి ధరమ్ తేజ్ కు సంబంధించి బ్యాలన్స్ పార్ట్ ని దర్శకుడు సముతిరఖని ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. జూలై 28 అట్టే దూరంలో లేదు. రోజులు పరిగెత్తుతున్నాయి. బ్రోకి ఇంకో చిక్కు ఉంది. టికెట్ రేట్లను పెంచమనే ప్రతిపాదన ఉండకపోవచ్చని మరో వార్త తిరుగుతోంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ నష్టాల గురించి పవన్ నిన్నో సభలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కోణంలో కూడా బ్రోని జాగ్రత్తగా డీల్ చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఇంకో వారం పది రోజుల్లో టీజర్ రానుంది.