ఒక్క మ‌హానాడు – అన్నింటికీ సమాధానం చెప్పేసిందా?

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఒకే ఒక్క మ‌హానాడునిర్వ‌హ‌ణ‌తో తెలుగు దేశం పార్టీ ఆత్మ‌గౌర‌వం .. నిల‌బ‌డింద‌ని.. పార్టీ అభిమానులే కాకుండా.. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ అంటున్నారు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీపై అనేక అనుమానాలు.. సందేహాలు.. ప్ర‌శ్న‌లు ముస‌రుకోవ‌డ‌మే. 2019లో కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైన టీడీపీ నుంచి మ‌రో న‌లుగురు జారిపోయారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ బ‌లం కేవ‌లం 19 మందిదీంతో ఇక‌, టీడీపీ ప‌ని అయిపోయింద‌నే టాక్ వ‌చ్చింది.

మరోవైపు.. 70 ప్ల‌స్ కు చేరుకున్న చంద్ర‌బాబు వ‌య‌సు కార‌ణంగా.. పార్టీని న‌డిపించేది ఎవ‌రు? ఆయ‌న త‌ర్వాత ఎవ‌రు ఉన్నారు. ఇక‌, పార్టీ లేన‌ట్టే.. అని పెద్ద ఎత్తున అధికార పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. దీంతో స‌మాధానం చెప్ప‌డం.. పార్టీకి క‌ష్ట‌త‌ర‌మే అయింది. దీనికి కూడా మ‌హానాడు స‌మాధానం చెప్పింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబు లో ఓపిక స‌డ‌లి పోలేద‌ని.. ఆయ‌న 70 ఏళ్ల‌లో ఉన్న యువ‌కుడ‌ని.. మ‌హానాడును గ్రాండ్ స‌క్సెస్ చేశార‌ని అంటున్నారు.

ఇక‌, వైసీపీ ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా టీడీపీ మొహం చూసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని.. టీడీపీకి ఇక‌, 2024 ఎన్నిక‌లే చివ‌రి ఎన్నిక‌ల‌ని.. వైసీపీ నాయ‌కులు తెగ ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో పార్టీలోనూ.. అంత‌ర్గతంగా ఆత్మ‌నూన్య‌తా భావం ఏర్ప‌డింది. నిజ‌మే ల‌క్ష‌ల కోట్లు తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌లకు పంచుతుంటే.. త‌మ‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌ని.. టీడీపీ నాయ‌కులు కూడా అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా మ‌హానాడుకు ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా వ‌చ్చారు. మరోవైపు మహానాడుకు పోటీగా పెట్టిన వైసీపీ యాత్రలకు జనం రావడం లేదు. దీంతో పార్టీపై వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్టు అయింద‌ని అంటున్నారు. మ‌రో కీల‌క విష‌యం..వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు లేకుండా.. చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని.. కూడా తీవ్ర విమ‌ర్శ‌లే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మ‌హానాడులో టీడీపీ స‌త్తా ఏంటో బ‌య‌ట‌ప‌డింది. అయిపోయింద‌ని అనుకున్న పార్టీ ఉవ్వెత్తున క‌డ‌లి కెర‌టంలా పైకి లేచింది. మేమున్నామంటూ.. వ‌ర్గాల‌కు, కులాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు మ‌హానాడుకు క్యూక‌ట్టారు. సో.. దీంతో టీడీపీపై ముసురుకున్న అనేక‌ సందేహాల‌కు ఒక్క మ‌హానాడే స‌మాధానం చెప్పింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.