తండేల్ కోసం రెండు క్లయిమాక్సులు ?

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా చాలా టైం ఉండటంతో టీమ్ హడావిడి పడకుండా నీట్ గా షూటింగ్ చేసుకుంటోంది. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సముద్రపు డ్రామాలో చైతు ఎప్పుడూ లేనంత మాస్ గా కనిపించబోతున్నాడు. పడవలు నడుపుతూ చేపలు పట్టే ఒక మాములు యువకుడు ప్రాణాలకు తెగించి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే పాయింట్ మీద చాలా థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారని ఇన్ సైడ్ టాక్.

దీనికి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ లీక్ ఏంటంటే తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లు పరిశిలనలో ఉన్నాయట. చైతు సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు మొండేటి వేర్వేరు వెర్షన్లు రాసుకున్నారట. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లోతుగా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ తరహాలో కాకుండా బుజ్జితల్లి క్యారెక్టర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే సాయిపల్లవిని కోరి మరీ తీసుకొచ్చారని వినికిడి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఇద్దరి నటన పీక్స్ లో ఉంటుందట.

మరి హ్యాపీగా ముగిస్తారా లేక సాడ్ ఎండింగ్ ఏమైనా ఇస్తారనేది వేచి చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న తండేల్ కు ఓటిటి డీఎల్ ఆల్రెడీ అయిపోయింది. నలభై కోట్లకు పైగా ఆఫర్ చేసి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే వార్త గతంలోనే వచ్చింది. థియేట్రికల్ పరంగానూ క్రేజ్ ఉన్న కాంబో కావడంతో టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే నమ్మకంతో నిర్మాతలున్నారు. అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ తో తండేల్ తలపడాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత ప్రమోషన్లు మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. చైతు తండేల్ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో చేయబోతున్నాడు.