సరైన దారిలో విజయ్ దేవరకొండ

ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఊహించని డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నిజానికి గీత గోవిందంని మించిన అంచనాలు పెట్టుకున్నాడు. తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ ఒక కారణం కాగా మధ్య తరగతి అంశాలు జనాలను థియేటర్లకు రప్పిస్తాయనే పాత్ర సూత్రాన్ని గుడ్డిగా నమ్ముకోవడం మరో రీజన్. ఏదైతేనేం ఫైనల్ గా బొమ్మ ఫ్లాప్ గా నిలిచింది. నిజానికి కొన్నేళ్లుగా కథల ఎంపిక రౌడీ హీరో చేస్తున్న పొరపాట్లే తగిన మూల్యం చెల్లించేలా చేశాయి. దానికి డియర్ కామ్రేడ్ నుంచి లైగర్ దాకా ఎన్నో ఉదాహరణలు. ఖుషి వసూళ్లు ఓకే కానీ అది కూడా యావరేజ్ కంటెంటే.

కొంత ఆలస్యమైనా విజయ్ దేవరకొండ లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. ముందే తెలిసిన వార్తలే అయినా ఇవాళ వచ్చిన అనౌన్స్ మెంట్స్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీ నేపధ్యం 19వ శతాబ్దంలో ఉంటుందని కీలకమైన క్లూ ఇచ్చారు. ఒక శాపగ్రస్తమైన నేలను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఏదో డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న వయొలెంట్ డ్రామాకు కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ క్యాప్షన్ పెట్టి ఆసక్తిని పెంచారు.

గౌతమ్ తిన్ననూరితో నిర్మాణంలో ఉన్న సినిమా తాలూకు టైటిల్, కాన్సెప్ట్ రెండూ రివీల్ చేయకపోయినా గతంలో ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఇది రా అండ్ రస్టిక్ డ్రామానే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ మూడు సినిమాల్లో ఏదీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కానీ లేదా రొమాంటిక్ లవ్ స్టోరీ కానీ కావు. ఆ మాటకొస్తే పూర్తిగా కాన్సెప్ట్ ని నమ్ముకున్నవి. విజయ్ దేవరకొండ చేయాల్సింది ఇలాంటి ప్రయోగాలే. అప్పుడు మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్న తన ఆశలకు దారి దొరుకుతుంది. మలయాళ, తమిళ ఆడియన్స్ సైతం రిసీవ్ చేసుకుంటారు. ఏదైతేనేం పుట్టినరోజునాడు ఫ్యాన్స్ కి మంచి కానుకే ఇచ్చారు.