తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా అనిపించేలా చేయడం ఈ జంట ప్రత్యేకత. నిన్న జరిగిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన జక్కన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు తారక్ స్నేహితుడు కాదని తమ్ముడని చెప్పడం ఒక్కసారిగా ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సాహం తెచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. రాజమౌళి డెబ్యూ స్టూడెంట్ నెంబర్ వన్ తో పాటు మొదటి ఇండస్ట్రీ హిట్ సింహాద్రి రెండింట్లోనో హీరో కావడం నుంచి ఈ ఫ్రెండ్ షిప్ బలపడుతూ వచ్చింది.

దాని తర్వాత యమదొంగ రూపంలో మరింత పైకెక్కింది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ లో నాలుగోసారి ఈ కాంబో చేతులు కలిపింది. పలు సందర్భాల్లో రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం తీయాలనేది నా కలని, జూనియర్ ఎన్టీఆర్ ని సుయోధనుడి లాంటి శక్తివంతమైన పాత్రలో చూపించాలని ఆశ పడుతున్నట్టు చెప్పుకొచ్చిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా అది నెరవేరలేదు కానీ భవిష్యత్తులో జరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే కనక ఒక గొప్ప విజువల్ గ్రాండియర్ ని తెరమీద చూసే అదృష్టం ఇప్పటి తరం ప్రేక్షకులకు కలుగుతుంది.

నిర్మాతలు సాహు గారపాటి, శోబు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన రాజమౌళి మహేష్ బాబు అప్డేట్ అడిగినందుకు అనిల్ రావిపూడిని స్టేజి మీద ర్యాగింగ్ చేయడం పేలింది. ఎవరైనా అతన్ని ముసుగేసి కొడితే పది వేల రూపాయలు ఇస్తానని చెప్పడం నవ్వులు పూయించింది. మొత్తానికి స్టార్ దర్శకుల కలయికతో సీతమ్మ వేడుక గ్రాండ్ గా జరిగింది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామాకు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించడంతో క్రమంగా హైప్ పెరుగుతోంది. మే 3నే రావాల్సి ఉన్నా ప్రమోషన్ల కోసం ఒక వారం వాయిదా వేసి మే 10 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.