జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో చెప్పిన ప్రకారం 2025లో వచ్చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు కానీ నిజానికి ఆ కోరిక అంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకో చూద్దాం. ఈ సీక్వెల్ కి ఇంకా క్యాస్టింగ్ కుదరలేదు. పెద్ద స్టార్స్ ని భాగం చేయాలనేది ప్రశాంత్ వర్మ టార్గెట్. కానీ దీనికి చాలా టైం పడుతుంది. తాను కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి నెరేషన్ ఇచ్చి ఒప్పించి రెమ్యునరేషన్లు గట్రా మాట్లాడి సెట్ చేయడానికి నెలలు గడిచిపోతాయి.

ఒకవైపు దీని పనులు చూసుకుంటూనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ తీస్తున్నాడు. సగానికి పైగానే పూర్తయ్యిందట. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రణ్వీర్ సింగ్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. అంతా ఓకే అనుకుంటే జై హనుమాన్ కంటే ముందు ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకో వైపు డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న అధీరాను తాను చేయాలా లేక ఇంకో దర్శకుడికి బాధ్యత అప్పగించాలానే ఆలోచనలో ప్రశాంత్ వర్మ తలమునకలై ఉన్నాడు.

ఇవన్నీ కొలిక్కి రావాలంటే జై హనుమాన్ ఆలస్యం తప్ప వేరే మార్గం లేదు. పరిణామాలు గమనిస్తే 2026 లేదా ఇంకో ఏడాది లేట్ గా తప్ప అంతకన్నా ముందు రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్, 3డి అంటూ కొత్త సాంకేతికతలు జోడిస్తున్న ప్రశాంత్ వర్మ ఇతర కమిట్ మెంట్స్ పూర్తి చేసిగాని దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఏవి ఇందులో భాగం పంచుకుంటాయనేది వెల్లడి కాలేదు. సో ఎదురు చూపులు కాస్త ఎక్కువే అవసరం పడేలా ఉన్నాయి. ఈ కారణంగానే తేజ సజ్జ కూడా జై హనుమాన్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాడు.