నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ గత నెల చివరి వారంలోనే రిలీజ్ లాక్ చేసుకుని సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా వేసుకుంది. సరే అయిందేదో అయ్యిందని సదరు అధికారులు చెప్పిన అభ్యంతరాలను సరిచేసి దానికి తగ్గట్టు క్లియరెన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. చాలా తక్కువ సమయం ఉండటం వల్ల ప్రమోషన్లకు సైతం ఇబ్బందే.

నారా రోహిత్ టిడిపి తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడీ ప్రతినిధి 2 కోసం ఏమైనా చేయాలంటే వెంటనే హైదరాబాద్ తిరిగి రావాలి. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను ఇప్పుడు వదులుతున్నారు కానీ వాటితో ఏ మేరకు పనవుతోందో చెప్పలేం. ఎన్నికల పోలింగ్ మే 13 జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడైతేనే వర్కౌట్ అవుతుందనేది నిర్మాతల ఆలోచన. కానీ జనాలు అంత సులభంగా థియేటర్లకు రావడం లేదు. పైగా ఓట్లేసే హడావిడి అంత దగ్గరగా ఉన్నప్పుడు సహజంగానే సినిమాల మీద అంత ఆసక్తి ఉండదు. ఇదంతా ఆలోచించుకోవాల్సిన విషయమే.

ప్రస్తుతానికి ప్రతినిధి 2 మే 10 రావడంలో ఎలాంటి మార్పు లేదు కానీ చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమో చూడాలి. ట్రైలర్ నుంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సోషల్ మెసేజ్ మూవీలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయనేది ఇన్ సైడ్ టాక్. కాకపోతే నేరుగా ఎవరినో ప్రస్తావించేలా కాకుండా సున్నితంగా టచ్ చేశారని అంటున్నారు. బహుశా సెన్సార్ ఆలస్యానికి ఇది కూడా కారణం అయ్యుండొచ్చు. గత రెండు మూడు నెలల్లో వచ్చిన రాజకీయ అజెండా సినిమాలన్నీ ఫెయిలైన తరుణంలో ఈ ప్రతినిధి 2 ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది.