అమ్మాయి కోసం ఊర మాస్ ‘రత్నం’

హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువనే సంగతి పక్కనపెడితే విశాల్ కు తెలుగులో మంచి మాస్ ఇమేజ్ ఉంది. పందెం కోడితో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కొన్ని వరస సినిమాలు కమర్షియల్ గా సాధించిన విజయాలు ఇమేజ్ ని పెంచాయి. అటుపై కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల పడ్డ డిజాస్టర్లు డబ్బింగ్ మార్కెట్ ని దెబ్బ కొట్టాయి. గోపీచంద్ లాగా సరైన కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న విశాల్ త్వరలో రత్నంగా రాబోతున్నాడు. సామీ, సింగం సిరీస్ తో బాగా పాపులరైన హరి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు. ఏప్రిల్ 26 థియేటర్లలో అడుగు పెడుతున్నాడు.

ట్రైలర్ చూస్తే విశాల్ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మళ్ళీ పాత స్కూలుకు వెళ్ళిపోయాడు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, వాటి పెద్దల మధ్య ఉండే పగలు, అవతలి వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం ఊచకోత కోస్తూ ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా రత్నం ఇలా మొత్తం సెటప్ ఒక ఫార్ములా ప్రకారం జరిగిపోయింది. బద్దశత్రువులుగా సముతిరఖని, మురళీశర్మలు కనిపించగా హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటించింది. విజువల్స్ గట్రా చూస్తుంటే దం బిర్యానీ లాంటి మహేష్ బాబు ఒక్కడుని అరవ సాంబార్ కలిపి వడ్డించినట్టు ఉంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకో డిఫరెంట్ గా అనిపించలేదు. సీన్లను ఎలివేట్ చేసిన ఫీలింగ్ కలగలేదు. విశాల్ పాత్ర మాస్ టచ్ తో గతంలో చూసినట్టే ఉంది. హరి మాత్రం సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలను మెప్పిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొనేందుకు విశాల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే రోజు తమన్నా – రాశిఖన్నాల బాక్ రిలీజవుతోంది. ముందురోజు నారా రోహిత్ ప్రతినిధి 2 ఉంది. సో ఎక్కువ పోటీలేని టైంలో ఇలాంటి మాస్ బొమ్మతో ఈసారైనా విశాల్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.