ఆలస్యం చేసిన బాయ్స్ అమృతం ఇస్తారా

ఎట్టకేలకు మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ 6 విడుదల కానుంది.  విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని పోటీ లేకుండా ఒక రోజు ఆలస్యంగా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా థియేటర్లలో అడుగు పెట్టనిస్తున్నారు. నిజానికి డబ్బింగ్ వెర్షన్ బాగా ఆలస్యమయ్యిందని చెప్పాలి. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మార్చి రెండు లేదా మూడో వారంలోనే తెద్దాం అనుకున్నారు. కానీ అనువాద కార్యక్రమాలతో పాటు సెన్సార్ లో జరిగిన జాప్యం వల్ల ఎదురు చూడక తప్పలేదు. ఓం భీమ్ బుష్ తో పాటు వచ్చేసినా పనయ్యేది.

ఇప్పుడీ మంజుమ్మల్ బాయ్స్ కు ఆలస్యం అమృతంగా మారుతుందో లేదో చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఉండబట్టలేక మూవీ లవర్స్ ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చూసేశారు. బాష రానివాళ్ళ కోసం మల్టీప్లెక్సులు సబ్ టైటిల్స్ కూడా వేయించాయి. ఒక్క భాగ్యనగరంలోనే రెండు వారాల్లో వందకు పైగా షోలు హౌస్ ఫుల్స్ కావడం అబద్దం కాదు. అలా అని తెలుగు చూడరని కాదు కానీ ఇంత గ్యాప్ వచ్చాక సహజంగానే ఆడియెన్స్ చూపు ఓటిటి మీదకు వెళ్తుంది. దీన్ని దాటుకోవాలంటే మంజుమ్మల్ బాయ్స్ కేరళ లాగే ఇక్కడ ఎక్స్ ట్రాడినరి టాక్ తెచ్చుకోవాలి.

ప్రేమలు సక్సెస్ చూశాక దీని మీద నమ్మకం పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే టిల్లు స్క్వేర్ వచ్చిన వారానికి, ఫ్యామిలీ స్టార్ రిలీజైన మరుసటి రోజే ఇంత కాంపిటీషన్ తట్టుకోవడం సులభం కాదు. మలయాళంలో రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ తమిళనాడులో కూడా భారీగా ఆడింది. ప్రత్యేకంగా ప్రమోషన్లను ప్లాన్ చేయబోతున్నారు నిర్మాతలు. కమల్ హాసన్ గుణ సినిమాలో ప్రియతమా కుశలమా పాటని పట్టుకుని కొడైకెనాల్ గుహల్లో తీసిన ఈ చిన్న బడ్జెట్ మూవీ ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి.