లక్ష్యానికి దగ్గరవుతున్న ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ రిలీజ్ రోజు కంటే తర్వాత పుంజుకుని సోమవారం హోలీ సెలవు పండగతో కలిపి 21 కోట్లకు గ్రాస్ రాబట్టడం విశేషమే. ఎందుకంటే కామెడీ బాగున్నప్పటికీ ఈ సినిమాకు యునానిమస్ గా అన్ని వర్గాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఆ మాటకొస్తే సామజవరగమన రేంజ్ లో పికప్ చూపించలేదు. అయినా సరే హాలిడేస్ ని సంపూర్ణంగా వాడుకుంటూ బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఒకే ఒక్క కొత్త ఆప్షన్ గా నిలవడంతో శ్రీవిష్ణు బృందానికి ఆడియన్స్ నుంచి మంచి మద్దతు దక్కుతోంది.

ట్రేడ్ టాక్ ప్రకారం ఇప్పటిదాకా పది కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఓం భీమ్ బుష్ ఇంకొక్క మూడు కోట్లు అదనంగా రాబట్టుకుంటే సేఫ్ గేమ్ అయిపోతుంది. శుక్రవారం టిల్లు స్క్వేర్ వస్తున్న నేపథ్యంలో ఈ మూడు రోజులు కీలకం కాబోతున్నాయి. దానికొచ్చే టాక్ ఎంత మేర ప్రభావం చూపిస్తుందో చూసుకోవాలి. అంకెల పరంగా ఈ సినిమాకు శ్రీవిష్ణు కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ చేశారు. యూత్ నుంచి మద్దతు దక్కడం వల్ల కలెక్షన్లు బాగా వచ్చాయి. మొదటి రోజు కన్నా నాలుగో రోజు ఎక్కువ ఫిగర్లు నమోదు కావడమే దానికి నిదర్శనం. ఇవాళ నుంచి వర్కింగ్ డేస్ కావడంతో సహజంగానే నెమ్మదించింది.

ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకో వారం పది రోజులు పట్టేలా ఉంది. ఫ్యామిలీ స్టార్ వచ్చేవరకు టిల్లు స్క్వేర్ తర్వాత బెస్ట్ ఆప్షన్ గా ఓం భీమ్ బుష్ ఉంటుంది కాబట్టి హిట్టు మైలురాయి దాటుకోవడం సులభమే. కాకపోతే భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటున్న అంచనాలు మాత్రం పూర్తిగా నెరవేరలేకపోయాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను థియేటర్ దాకా రాబట్టే కంటెంట్ గా పేరు రాకపోవడం ప్రభావం చూపించింది. ఏదైతేనేం శ్రీవిష్ణుకి మరో హిట్టు ఖాతాలో పడిపోయింది. రౌడీ బాయ్స్ ఫెయిల్యూర్ తో కాస్త డీలా పడిన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి హుషారు తర్వాత మరో సక్సెస్ దక్కిందని చెప్పాలి.