కమల్ హాసన్ మణిరత్నం సినిమాకు ఇలాంటి పరిస్థితా

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కాంబినేషన్ అంటే వెంటనే నాయకుడు గుర్తొస్తుంది. ఇండియన్ సినిమా మీద అది చూపించిన ప్రభావం గురించి గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. 1987లో విడుదలైన ఆ ఆల్ టైం క్లాసిక్ దేశదేశాలు దాటి ఎంతో ఖ్యాతిని సంపాదించింది. అయితే ఇంత గొప్ప ఫలితం అందుకున్నా ఈ కాంబినేషన్ తిరిగి సాధ్యపడలేదు. మూడు దశాబ్దాల తర్వాత తగ్ లైఫ్ తో కార్యరూపం దాల్చింది. ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ప్రకటించి నప్పటి నుంచి ట్రేడ్, ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

విచిత్రంగా ఇంత క్రేజీ కలయికకు ముందు ఓకే చెప్పి తర్వాత తప్పుకుంటున్న హీరోల జాబితా పెరుగుతోంది. ఫస్ట్ దుల్కర్ సల్మాన్ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యాడు. తాజాగా జయం రవి సుదీర్ఘంగా కాల్ షీట్లు సర్దుబాటు చేయలేనని చెప్పి పక్కకు వచ్చేసినట్టు చెన్నై టాక్. వీళ్లకు రీ ప్లేస్ మెంట్ వెతకడం మణిరత్నంకు పెద్ద సవాల్. ఎందుకంటే నటులంటే ఎవరో ఒకరు దొరుకుతారు కానీ తగ్ లైఫ్ బడ్జెట్ కు తగ్గట్టు ఇమేజ్ ఉన్న హీరోలైతేనే బిజినెస్ పరంగా క్రేజ్ వస్తుంది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ అంత విజయవంతం కావడంలో స్టార్ క్యాస్టింగ్ పాత్ర చాలా కీలకం.

ఇప్పుడీ సమస్యను పరిష్కరించుకునే దిశగా కమల్, మణిరత్నంలు తీవ్ర సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. కనీసం మూడు నాలుగు నెలలు డేట్లు అవసరం ఉండటంతో చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నవాళ్లకు ఓకే చెప్పడం కష్టంగా మారింది. అందుకే రెగ్యులర్ షూటింగ్ కొంత ఆగి ఆగి సాగుతోందట. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని తొలుత అనుకున్నా ఇప్పుడది సాధ్యపడేలా లేదు. 2025 సంక్రాంతికి ఎవరెవరు పోటీలో ఉంటారనే దాని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది. త్రిష, గౌతమ్ కార్తీక్, నాజర్, అభిరామి, జోజు జార్జ్ తగ్ లైఫ్ లోని ఇతర తారాగణం.