హీరో గారి అలక తీరింది కానీ..

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే ‘కర్ణన్’ సినిమాతో పలకరించాడు. తెలుగులో ‘వకీల్ సాబ్’ విడుదలైన రోజే తమిళనాట రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మరింతగా ప్రేక్షకులకు చేరువైంది.

ధనుష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘కర్ణన్’ పేరు సంపాదించింది. ఐతే నిజానికి ధనుష్ ‘కర్ణన్’ కంటే ముందు వేరే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఏడాది కిందటే విడుదలకు సిద్ధమైన ఆ చిత్రమే.. జగమే తంత్రం. పిజ్జా, జిగర్ తండ, పేట చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం కోసమే చాన్నాళ్లు ఆగారు. నిరుడు లాక్ డౌన్ అంతా అయ్యి థియేటర్లు తెరుచుకుంటాయని ఎదరు చూశారు.

ఐతే చివరికి థియేటర్లు తెరుచుకునే సమయానికి నిర్మాత ఆలోచన మారిపోయింది.ఓటీటీ వైపు అడుగులేశారు. ధనుష్‌తో మాట్లాడకుండానే నిర్మాత శశికాంత్ ‘జగమే తంత్రం’ను నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ ేచయడానికి ఒప్పందం చేసుకున్నారు. దీనిపై తన అసంతృప్తిని ధనుష్ బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ‘జగమే తంత్రం’ను థియేటర్లలోనేే రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్న తన అభిమానులను మరింత రెచ్చగొట్టేలా అతనో ట్వీట్ వేశాడు. తన ఉద్దేశమైతే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలనేదే అని.. కానీ తన చేతుల్లో ఏం లేదని.. ఏం జరుగుతుందో చూడాలనే విధంగా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. అతనిలా ట్వీట్ చేసిన కొన్ని రోజులకే ‘జగమే తంత్రం’ను నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇక అప్పట్నుంచి ధనుష్ మౌనం వహిస్తున్నాడు.

ఓవైపు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి ట్వీట్లు వేస్తున్నా.. టీజర్ రిలీజైనపుడు కూడా ప్రమోట్ చేసినా.. ధనుష్ మాత్రం స్పందించలేదు. ఐతే తాజాగా ‘జగమే తంత్రం’ ట్రైలర్ లాంచ్ అయింది. ఇంకో రెండు వారాల్లోనే సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా సైలెంటుగా ఉంటే బాగోదని ధనుష్ స్పందించాడు. ట్రైలర్‌ను షేర్ చేశాడు.

ధనుష్ అలక తీరినట్లే ఉంది కానీ.. అయినా కూడా తన అసంతృప్తిని బయటపెట్టేశాడు. ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే అద్భుతంగా ఉండేదని.. అలాంటి సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లోకి వస్తోందని ఒక వ్యాఖ్య చేశాడు. దీన్ని బట్టి ఓటీటీ రిలీజ్ పట్ల ఇప్పటికీ ధనుష్‌లో అసంతృప్తి ఉన్నప్పటికీ తప్పక ఊరుకున్నట్లు కనిపిస్తోంది.