అపుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ఇపుడు కూరగాయల కొట్టు

జపాన్ లో ఏ పాఠశాలల్లో పనివాళ్లు ఉండరు. ఎందుకో తెలుసా? పిల్లలకు పనివిలువ నేర్పడానికి ఊడ్చడం నుంచి బాత్ రూంలు కడగడం వరకు అన్నీ ఆ పిల్లలే చేసుకుంటారు. ఎందుకిలా చేస్తారంటే… పిల్లలకు పనివిలువ తెలియాలని ఒక సిద్దాంతంగా పెట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంతే. ఏ మార్పు ఉండదు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఎక్కువగా టూరిజం, విమానయాన రంగాలపై ప్రభావం పడింది. ఐటీ రంగంపై కాస్త తక్కువగా ప్రభావం పడినప్పటికీ పలు సంస్థలు ఉద్యోగాల కోతను చేపట్టాయి. కరోనా కారణంగా వరంగల్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగి కూడా టెక్కీ ఉద్యోగం కోల్పోయినప్పటికీ కూరగాయల దుకాణం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలిచారు. నామోషీ అనే మాటకు తావే లేదని, బ్రతకడానికి నిజాయితీగా ఏమైనా చేయొచ్చని ఆమె గర్వంగా చెప్పారు.

వరంగల్‌కు చెందిన శారద ఓ సాఫ్టువేర్ కంపెనీలో పర్ఫార్మెన్స్ అనలిస్ట్ విభాగంలో పని చేశారు. కొద్ది నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ట్రెయినింగ్ పూర్తయింది. ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్ వచ్చింది. దీంతో ఆమెను తిప్పి పంపించారు. ప్రాజెక్టులు లేవని, కాబట్టి హాఫ్ శాలరీ కూడా ఇవ్వలేమని చెప్పారు. జీతం పోయినప్పటికీ జీవితం పోయినట్లు కాదని భావించిన ఆమె కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నారు.

ఇంజినీరింగ్ చదివి, సాఫ్టువేర్ ఇంజినీర్ ఉద్యోగం చేయడానికి బదులు కూరగాయలు అమ్ముతున్నందుకు తనకు ఏమాత్రం బాధ లేదని, తన తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు, తన జీవనం కోసం చేస్తున్నానని, ఉద్యోగం పోయినందుకు సాధారణంగా కాస్త బాధ ఉండటం సహజమేనని, కానీ నేను ఏ విధంగానైనా బతకగలనని, ఈ జీవనం సాగిస్తున్నందుకు బాధ మాత్రం లేదని తెలిపారు. ఉద్యోగం ఉంటేనే బతుకుతానని, ఇది చేస్తే నామోషి అనే ఆలోచన తనకు లేదన్నారు. తాను ఉద్యోగం వదిలివేయలేదని, పరిస్థితులు అలా వచ్చాయన్నారు. సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిన మూడు నెలలకే ఆ జాబ్ పోయిందన్నారు. అంతకుముందు రెండున్నరేళ్లు ఢిల్లీలోని పర్ఫార్మెన్స్ అనలిస్ట్‌గా చేసి వచ్చానని చెప్పారు.

ఉద్యోగం ఉంటేనే.. జీతం వస్తేనే లైఫ్ కాదని, కాస్త పాజిటివ్‌గా ఆలోచించాలని, దేవుడు మనకు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని చెప్పారు. బతకాలనుకుంటే కూరగాయలు అమ్మి, పూలు అమ్మి.. ఇలా ఏం చేసైనా బతకవచ్చునన్నారు. లగ్జరీగా బతికితేనే లైఫ్ కాదన్నారు. ఇలా అమ్ముతున్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని, టైమ్ బ్యాడ్, దానికి ఎవరు ఏం చేస్తారన్నారు.

ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న శారద కథ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. దీనిపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్పందించారు. శారద యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారని, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కథనాలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం, వివిధ పార్టీల నాయకులు, ఎన్నారైలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు కొన్ని ఐటీ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.