షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక ఈ స్కానింగ్ పని లేకుండా పేమెంట్ చేసే విధానాన్ని NPCI తీసుకొస్తోంది. షాప్లోని పీఓఎస్ మెషీన్ దగ్గర ఫోన్ను ఉంచితే చాలు. షాప్ వివరాలు ఫోన్లోకి వస్తాయి. అమౌంట్ చూసుకుని పిన్ లేదా అవసరమైన అథెంటికేషన్ పూర్తి చేస్తే పేమెంట్ అయిపోతుంది.
నిజానికి యూపీఐలో ‘ట్యాప్ అండ్ పే’ ఇప్పటికే ఉంది. కొన్ని యాప్స్లో ఎన్ఎఫ్సీ ట్యాగ్ లేదా స్మార్ట్ క్యూఆర్ దగ్గర ఫోన్ను పెట్టి పేమెంట్ చేయొచ్చు. అయితే ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేసి ట్యాప్ అండ్ పే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు తీసుకొస్తున్న విధానంలో యాప్ను ముందుగా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇది డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే ట్యాప్ పేమెంట్లాగే కనిపిస్తుంది. తేడా ఏంటంటే కార్డు బదులు మన ఫోన్లోని యూపీఐ అకౌంట్ నుంచి డబ్బు వెళ్తుంది. ఫోన్లో ఉండే ఎన్ఎఫ్సీ టెక్నాలజీ ద్వారా పీఓఎస్ మెషీన్, మొబైల్ మధ్య అవసరమైన పేమెంట్ వివరాలు చేరతాయి.
అయితే ఫోన్ జేబులో ఉండగా ఎవరైనా పీఓఎస్ మెషీన్ దగ్గర పెట్టారని డబ్బు ఆటోమేటిక్గా వెళ్లిపోదు. ట్యాప్ చేయడం వల్ల పేమెంట్ ప్రక్రియ మొదలవుతుంది. ఎంత అమౌంట్, ఎవరికి చెల్లిస్తున్నామనే వివరాలు చూసి యూజర్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాతే సాధారణ యూపీఐ పేమెంట్ పూర్తవుతుంది.
ఈ విధానాన్ని తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకు 20 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. కొత్త ట్యాప్ విధానం అందుబాటులోకి వస్తే షాపుల్లో క్యూఆర్ కోడ్ కోసం కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేసే స్టెప్ను తప్పించుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates