శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి వరుసగా కొత్త మోడల్స్ తీసుకొస్తోంది. హువావే, గూగుల్ కూడా ఈ మార్కెట్‌లోకి వచ్చాయి. యాపిల్ మాత్రం ఇన్నేళ్లూ దూరంగానే ఉంది. ఇప్పుడు తొలిసారి తన ఫోల్డబుల్ ఐఫోన్‌ను ‘ఐఫోన్ డ్యుయో’ పేరుతో తీసుకొచ్చింది.

యాపిల్ ఆలస్యంగా రావడం కొత్తేమీ కాదు. కొత్త టెక్నాలజీ వచ్చిన వెంటనే మార్కెట్‌లోకి దిగకుండా, అది కొంత మెరుగయ్యాక ఎంట్రీ ఇవ్వడం గతంలోనూ జరిగింది. ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మొదటి మోడల్స్‌లో స్క్రీన్ మధ్యలో మడత కనిపించడం, డిస్‌ప్లే దెబ్బతినడం, బ్యాటరీ సమస్యలు, భారీ ధర వంటి అంశాలపై పిర్యాదులు వచ్చాయి.

ఇప్పుడు వచ్చిన ఐఫోన్ డ్యుయోను తెరిస్తే 7.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. బయట 5.4 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. ఒకేసారి రెండు యాప్స్ ఉపయోగించుకోవచ్చు. ఏ20 ప్రో చిప్‌తో పాటు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్‌ను ఏకంగా 2 టీబీ వరకు తీసుకోవచ్చు. ధర మాత్రం సాధారణ ఐఫోన్ స్థాయిలో లేదు. అమెరికాలో 1,999 డాలర్ల నుంచి మొదలవుతోంది. శాంసంగ్, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ల బేస్ మోడల్స్ కంటే ఇది దాదాపు 100 డాలర్లు ఎక్కువ. అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుని, అక్టోబర్ 23 నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నారు.

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్స్ వాటా ఇప్పటికీ సింగిల్ డిజిట్‌లోనే ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో శాంసంగ్‌కు సుమారు 40 శాతం, హువావేకు 30 శాతం వాటా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫోల్డబుల్ ఫోన్ల అమ్మకాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా.