ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ రక్షిత అటవీ ప్రాంతంలో ఏడాది లోపు వయసున్న ఐదు ఒరాంగుటాన్లను అధికారులు గుర్తించి రక్షించారు. వీటిలో రెండు ఆడవి, మూడు మగవి ఉన్నాయి.

సహజంగా ఒరాంగుటాన్లు ఉష్ణమండల వర్షారణ్యాల్లో మాత్రమే జీవిస్తాయి. అవి సహజంగా ఈ ప్రాంతానికి వలస వచ్చే అవకాశం లేదు. వీటిని ఇక్కడికి అక్రమంగా రావు చేసి ఉండవచ్చు అని భావిస్తున్నట్లు బాలాసోర్‌ డీఎఫ్‌ఓ ఇందల్కర్‌ ప్రతీక్‌ ప్రకాశ్‌ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

బాలాసోర్‌ అటవీ విభాగం నుంచి రక్షించిన ఐదు ఒరాంగుటాన్లను భువనేశ్వర్‌లోని నందనకానన్‌ జూలాజికల్‌ పార్క్‌కు నిన్న రాత్రి తరలించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, శుభ్రం చేసి, లింగ నిర్ధారణ అనంతరం సీసీటీవీ పర్యవేక్షణలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌ మిరాసే తెలిపారు.

వాటికి సిబ్బంది ఆహారం అందిస్తున్నారని, కొన్ని అరటిపండ్లను చేతులతోనే తింటున్నాయని తెలిపారు. రెండు ఒరాంగుటాన్లు చాలా చిన్నవని, వాటిలో ఒకదానికి తీసుకొచ్చిన సమయంలో జ్వరం ఉండటంతో మందులు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం అన్నింటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అవి నందనకానన్‌లోనే ఉంటాయని వెల్లడించారు.